భారీ ఉగ్ర కుట్ర భగ్నం..తమిళనాడు, బెంగాల్‌ల్లో 8 మంది అరెస్ట్

భారీ ఉగ్ర కుట్ర భగ్నం..తమిళనాడు, బెంగాల్‌ల్లో 8 మంది అరెస్ట్
 
విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి, మన దేశంలో ఉగ్రదాడులకు కుట్ర పన్నిన ఒక ముఠాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో ఎనిమిది మంది ఉగ్ర ముఠాను అరెస్టు చేశారు. అరెస్టైన ఉగ్ర నిందితులకు పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తొయిబా సంస్థతో, పాక్ స్పై ఏజెన్సీ ఐఎస్ఐతోపాటు బంగ్లాదేశ్‌కు చెందిన మరో ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయి.

విదేశీ సంస్థల ఆదేశాల మేరకు నిందితులు త్వరలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ నుంచి అందిన సమాచారంతో ఢిల్లీ పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో ఏకకాలంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో దాడులు నిర్వహించారు. నిందితుల్ని మిజానూర్ రహమాన్, మొహమ్మద్ షాబత్, ఉమర్, మొహమ్మద్ లిటన్, మొహమ్మద్ షాహిద్, మొహమ్మద్ ఉజ్జల్‌గా గుర్తించారు. 

వీరిలో ఆరుగురు తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాకు చెందిన వాళ్లు కాగా, ఇద్దరు బెంగాల్‌కు చెందిన వాళ్లు. అరెస్టైన వారిలో బంగ్లాదేశీయులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు అక్రమ ఆధార్ కార్డులు కలిగి ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. నిందితుల మొబైల్ ఫోన్లలో ఢిల్లీలో బ్లాస్ట్‌ చేయవలసిన ప్రదేశాలకు సంబంధించిన వీడియోలున్నాయి. అందులో ఢిల్లీ మెట్రో కూడా ఉంది. 

వీరి వద్ద నుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితులు సాధారణ వ్యక్తుల్లాగా ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. వీరికి కాశ్మీర్‌కు చెందిన ఒక తీవ్రవాది సూచనలిస్తున్నట్లు తేలింది. అతడు లష్కరే తొయిబా సంస్థకు చెందిన వాడు. కానీ, ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి ఈ ముఠాను నడిపిస్తున్నాడు. 

అతడు ఇంతకుముందు పాకిస్తాన్‌లో శిక్షణ తీసుకున్నాడు. ప్రజలనుమతం పేరుతో రెచ్చగొట్టే విధంగా, ఫ్రీ కాశ్మీర్ అంటూ రూపొందించిన పోస్టర్ల గురించి విచారిస్తుండగా ఈ ముఠా వ్యవహారం బయటపడింది. అరెస్టైన వారిని తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల కోసం రైలులో దిల్లీకి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  ఈ ఎనిమిది మంది సోషల్ మీడియా ద్వారా పరస్పరం సంప్రదింపులు కొనసాగించిటన్లు పోలీసులు తెలిపారు. 

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర సంస్థలకు మద్దతుగా పోస్టులు పెట్టినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ ఎనిమిది మందిలో నలుగురు ఇటీవల జరిగిన ఏఐ సమ్మిట్ సందర్భంగా దిల్లీకి వచ్చి ‘ఫ్రీ కశ్మీర్’ వంటి ప్రేరేపణాత్మక పోస్టర్లు మెట్రో స్టేషన్‌లో అతికించినట్లు పోలీసుల తెలిపారు. ఆ తర్వాత తిరిగి తమిళనాడు, బంగాల్​లకు వెళ్లినట్లు వెల్లడించారు. బంగ్లాదేశ్‌కు చెందిన తంజీమ్ సంస్థలతో వీరి సంబంధాలపై మరింత విచారణ చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.