పబ్‌లు, క్లబ్బుల్లో దాడులకు ఉగ్రసంస్థ జెఇఎం యత్నం

పబ్‌లు, క్లబ్బుల్లో దాడులకు ఉగ్రసంస్థ జెఇఎం యత్నం
పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ (జెఇఎం) ఉగ్రవాద సంస్థ భారతీయులే లక్ష్యంగా ఒక భారీ అంతర్జాతీయ కుట్రకు తెరలేపింది. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు యాజమానులుగా ఉన్న నైట్‌క్లబ్బులు, పబ్‌లు, బార్లలో దాడులు చేసేందుకు యువతులను నియమించుకుంటోంది. ఈ సంచలన విషయాన్ని భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. జైషే తన మహిళా విభాగాన్ని ఈ ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా రంగంలోకి దించింది. 
 
అందంగా ఉన్న యువతులను ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇస్తున్నారు. అనంతరం వీరిని ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో భారతీయులు నిర్వహిస్తున్న క్లబ్బులలో ఉద్యోగాల్లో చేర్పిస్తారు. అక్కడ పనిచేస్తూ, ఆ ప్రదేశంపై పూర్తి సమాచారం (రెక్కీ) సేకరించడం వీరి ప్రాథమిక విధి అని ఓ అధికారి తెలిపారు. రెక్కీ పూర్తయిన తర్వాత, అదే మహిళలతో దాడులు చేయించాలని జైషే ప్లాన్ చేస్తోంది. 
ప్రస్తుతం అమెరికా, యూకే, థాయ్‌లాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, దుబాయ్ వంటి దేశాల్లోని లక్ష్యాలను గుర్తిస్తున్నట్లు సమాచారం.  ఈ కుట్రలో పాకిస్థాన్ ప్రమేయం బయటపడకుండా ఉండేందుకు, పాకిస్థానీ మహిళలను తక్కువ సంఖ్యలో వాడుకుని, ఉజ్బెకిస్థాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల నుంచి ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఐఎస్ఐ సహకారంతో వీరికి నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించి ఉద్యోగాల్లో చేర్పిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఒకరు వివరించారు. 

ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన అన్ని ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు జరిపి సంచలనం సృష్టించాలని జైషే భావిస్తోంది. ఈ భారీ ఆపరేషన్ కోసం పెద్ద ఎత్తున నిధులు అవసరం కావడంతో, ‘గాజా సహాయం’ పేరుతో పాకిస్థాన్, గల్ఫ్ దేశాల్లో గత నాలుగు నెలలుగా విరాళాలు సేకరిస్తోంది. వ్యక్తిగత నష్టాలు, వేధింపులకు గురైన చరిత్ర ఉన్న మహిళలనే జైషే ఎక్కువగా లక్ష్యం చేసుకుంటోంది.