జాతీయ చిహ్నాలను గౌరవించని వారు, వందేమాతరం గేయాన్ని వ్యతిరేకించే వారు దేశద్రోహానికి పాల్పడుతున్నట్లేనని ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. దేశ రాజ్యాంగం పట్ల గౌరవం లేనివారే ఇలాంటి వివాదాలకు తెరలేపుతున్నారని సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్లను ఉద్దేశించి ఆయన మండిపడ్డారు.
శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ “ఒకవైపు రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడుతూనే, మరోవైపు జాతీయ గేయాన్ని పాడబోమని అనడం ఏంటి?” అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ సభ 1950 జనవరి 24నే వందేమాతరానికి జాతీయ గేయంగా గుర్తింపు ఇచ్చిందని, దీనిని వ్యతిరేకించడం అంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిని అవమానించడమేనని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న తరుణంలో విపక్షాల తీరు అభ్యంతరకరంగా ఉందని పేర్కొన్నారు. 2017కు ముందు ఉత్తరప్రదేశ్ ఎలా ఉండేదో గుర్తుచేస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో వచ్చిన మార్పులను యోగి వివరించారు. గతంలో యూపీ అంటే అరాచక ప్రదేశ్ (ఉపద్రవ్ ప్రదేశ్) అని, ఇప్పుడు అది ఉత్సవ ప్రదేశ్గా మారిందని చెప్పారు.
“రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనకు కట్టుబడి ఉంది. వ్యవస్థీకృత నేరాలను నియంత్రించడం జరిగింది. నేడు, యుపి బిమారు ట్యాగ్ నుండి విముక్తి పొందింది. సాంకేతికత, నమ్మకం, పరివర్తన అనే మూడు త్రివేణిగా మారింది. గతంలో, యుపిని దేశానికి అడ్డంకిగా భావించేవారు. కానీ నేడు యుపి దేశ అభివృద్ధికి ఒక ముందడుగు వేసే రాష్ట్రంగా మారింది” అని ఆయన పేర్కొన్నారు.
మొదటిసారిగా, రాష్ట్ర ఆర్థిక సర్వేను (ఫిబ్రవరి 9న) అసెంబ్లీలో ప్రవేశ పెట్టమని చెబుతూ, ఈ సర్వే తొమ్మిది సంవత్సరాల ఆలోచనల నుండి వ్యవస్థలకు, వ్యవస్థల నుండి అభివృద్ధికి జరిగిన వినూత్న ప్రయాణానికి ప్రతీక అని ఆయన తెలిపారు. “ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రతి నివాసి కోరుకునే కొత్త శకానికి నాంది. గతంలో, యుపి యువతను ఇతర రాష్ట్రాల్లో అనుమానంతో చూసేవారు. వారు గుర్తింపు సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. నేడు, ఉత్తరప్రదేశ్ ఈ సవాలును అధిగమించి అభివృద్ధి దిశను రూపొందించే ప్రముఖ రాష్ట్రాలలో ఒకటిగా స్థిరపడింది” అని ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.
సమాజ్వాదీ పార్టీని విమర్శిస్తూ, 2017కి ముందు, గూండాలు, మాఫియా ప్రభుత్వ రక్షణలో పనిచేసేవని ముఖ్యమంత్రి ఆరోపించారు. “గత ప్రభుత్వ హయాంలో ఒకే జిల్లా-ఒక మాఫియా వ్యవస్థ ఉండేది. పోలీసు బలగాల విశ్వాసం సన్నగిల్లింది. మహిళలు, వ్యాపారులు సురక్షితంగా లేరు” అని ఆయన విమర్శించారు.
ఒకప్పుడు భయంతో బతికిన ప్రజలు ఇప్పుడు భక్తి మార్గంలో ఉన్నారని పేర్కొన్నారు. దానికి నిదర్శనం మహాకుంభమేళాకు 66 కోట్ల మంది, ప్రస్తుత మాఘమేళాకు 21 కోట్ల మంది భక్తులు హాజరవ్వడమేనని తెలిపారు. “నా కర్ఫ్యూ, నా దంగా.. యూపీ మే సబ్ చంగా” (అల్లర్లు లేవు, కర్ఫ్యూలు లేవు.. యూపీలో అంతా బాగుంది) అంటూ రైమింగ్తో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు.
టెక్నాలజీ, నమ్మకం, రవాణాల కలయికగా ఉత్తరప్రదేశ్ అవతరించిందని యోగి పేర్కొన్నారు. అయోధ్య గౌరవం, కాశీ చైతన్యం, మధుర భక్తి, ప్రయాగ్రాజ్ సామరస్యమే భారతదేశపు అసలైన ఆత్మ అని పేర్కొంటూ తమ ప్రభుత్వం వారసత్వానికి ప్రాధాన్యత ఇస్తూనే ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేస్తోందని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న మహిళా గవర్నర్ను అగౌరవపరచడం విపక్షాల సంస్కృతికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.

More Stories
అరుణాచల్ సమీపంలో చైనా ‘న్యూక్లియర్’ ప్లాంట్లు
నిష్క్రమణ ప్రసంగంలో యూనస్ భారత్ ను రెచ్చగొట్టే వాఖ్యలు
రైతుల కోసం ఏఐ ఆధారిత భారత్-విస్తార్ నేడే ప్రారంభం