విద్యుత్ బకాయిలు రూ 15 కోట్లు చెల్లించాలి.. ‘గీతం’ కు సుప్రీం ఆదేశం

విద్యుత్ బకాయిలు రూ 15 కోట్లు చెల్లించాలి.. ‘గీతం’ కు సుప్రీం ఆదేశం

తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌)కు నెల రోజుల్లో రూ.15 కోట్లు డిపాజిట్‌ చేయాలని గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (గీతం)ను సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గీతం ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ అనే కోణాన్ని దష్టిలో పెట్టుకొని, మధ్యంతర వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొంది. 

ఇరు పక్షాల హక్కులకు భంగం వాటిల్లకూడదనే ఆలోచనతనోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వ్యాఖ్యానించింది. టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ కు డబ్బులు చెల్లించాల్సిందే అని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై గీతం యాజమాన్యం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ పిటిషన్‌ పై సోమవారం జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్‌ అలోక్‌ అరధేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. 

గీతం తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ శ్యాం దివన్‌, చల్లా కోదండరాం, వై రాజగోపాల రావు, టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ తరఫున సీనియర్‌ అడ్డొకేట్‌ లు ఎస్‌.నిరంజన్‌ రెడ్డి హాజరయ్యారు. 

తొలుత గీతం తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ”గతంలో గీతం యాజమాన్యం అధీనంలోనే విబిసి ఫెర్రో ఎల్లాయిస్‌ అనే కంపెనీ ఉండేది. ఆ తర్వాత క్రమంలో దానిని ఇతరులకు విక్రయించారు. అయినప్పటికీ ఆ కంపెనీ విద్యుత్‌ బకాయిలను గీతం యాజమాన్యమే చెల్లించాలని విద్యుత్‌ సంస్థ నోటీసులు జారీ చేసింది. ఇది సరికాదు” అని పేర్కొంది. 

ఈ వాదనలను విన్న ధర్మాసనం గీతం సంస్థను రూ. 15 కోట్ల మొత్తాన్ని విద్యుత్‌ సంస్థ వద్ద డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ కేసులో హైకోర్టు గతంలో చేసిన వ్యాఖ్యలు కేవలం మధ్యంతర ఉత్తర్వులకు మాత్రమే పరిమితమని, అవి కేసు తుది మెరిట్స్‌పై ఎలాంటి ప్రభావం చూపవని ధర్మాసనం స్పష్టం చేసింది. 

అలాగే, ఈ నగదు డిపాజిట్‌ అనేది ఉభయ పక్షాల హక్కులకు భంగం కలగకుండా చేసిన తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని పేర్కొంది. అలాగే, హైకోర్టులో పెండింగ్‌ లో ఉన్న ప్రధాన రిట్‌ పిటిషన్‌ ను త్వరితగతిన విచారించి, పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టును సూచించింది.