కరీంనగర్ మేయర్‌గా బిజెపి అభ్యర్థి కొలగాని శ్రీనివాస్

కరీంనగర్ మేయర్‌గా బిజెపి అభ్యర్థి కొలగాని శ్రీనివాస్
కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. మేయర్‌గా ఆ పార్టీకి చెందిన కొలగాని శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు. 34 మంది కార్పొరేటర్ల మద్దతుతో మేయర్‌ పీఠాన్ని కమలదళం దక్కించుకుంది. డిప్యూటీ మేయర్‌గా అదే పార్టీకి చెందిన సునీల్‌ రావు నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రకటించారు.  అంతకు మందు కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. 
ప్రత్యేక అధికారి ఆర్డీవో మహేష్ సభ్యులతో ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్‌, మానకొండూరు ఎమ్మెల్యే, ఎక్స్ అఫిషియో సభ్యుడు సత్యనారాయణ హాజరైయ్యారు.  66 స్థానాలున్న కరీంనగర్‌ కార్పొరేషన్‌లో జీజేపీ అత్యధికంగా 30 స్థానాల్లో గెలిచినప్పటికీ బల నిరూపణ చేసుకొని పీఠాన్ని కైవసం చేసుకుంటుందా? అనే ఉత్కంఠ నెలకొంది. 
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్‌బీ) సభ్యులు, స్వతంత్రులు కలిసి ఎలాగైనా కార్పొరేషన్‌ను తమకు అనుకూలంగా మలచుకోవాలనే విధంగా చక్రం తిప్పారని సమాచారం.  కాంగ్రెస్ గెలిచింది 14 సీట్లు, ఎంఐఎం గెలిచింది 3 సీట్లు, బీఆర్ఎస్ గెలిచింది 9 సీట్లు. అన్నీ కలుపుకున్నా 26 సీట్లు మాత్రమే. అయినా మేయర్ పదవికోసం చివరివరకు ప్రయత్నించారు. 
ఇందులో భాగంగానే హైదరాబాద్‌ నగర శివారులోని ఓ రిసార్టులో వేర్వేరుగా క్యాంపులు నిర్వహించినట్లు తెలుస్తోంది.మేయర్‌ పదవి కోసం ఇరువర్గాల (కాంగ్రెస్‌, బీజేపీ) మధ్య సంఖ్యాపరంగా దోబూచులాట కొనసాగింది. చివరికి మేయర్‌ పీఠాన్ని బీజేపీనే దక్కించుకుంది. కరీంనగర్‌ మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ వ్యూహత్మకంగా వ్యవహరించారు. మేయర్ పదవికి పోటీ పడ్డ కాంగ్రెస్‌ అభ్యర్థికి 21 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ తటస్థంగా వ్యవహరించింది.
కరీంనగర్ గడ్డ మీద ప్రజాస్వామ్యం నిలబడిందని బండి సంజయ్ కొనియాడారు. ప్రజల సహకారంతో ఇది సాధ్యం అయిందని తెలిపారు. పక్క పార్టీలతో జరిగిన కబడ్డీ కప్​లో బీజేపీ గెలిచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు అనేక కుట్రలకు పాల్పడ్డారని, అవన్నీ బయటికి చెప్పలేమని చెబుతూ కరీంనగర్ బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలన్న కల నెలవేరిందని చెప్పారు. 
ఎన్నికల వరకే రాజకీయాలు ఆ తర్వాత రాజకీయాలు పక్కనపెట్టాలి. కరీంనగర్‌ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల బరిలోకి దిగాం. కరీంనగర్‌ అభివృద్ధికి కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులనూ కలుస్తాం. బీజేపీ మేయర్ ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా వదిలేది లేదు” అని సంజయ్ స్ఫష్టం చేశారు.
బీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌ పార్టీలన్నీ కలిసి సాధించింది ఏంటి? అని ప్రశ్నిస్తూ ఎన్నికల్లో తాము గెలిచినా మేయర్‌గా ఓడించేందుకు మూడు పార్టీలు కలిసి కుట్రలు చేశాయని ధ్వజమెత్తారు. 
“సీఎం రేవంత్ రెడ్డి గారూ…. మెజారిటీ సీట్లను సాధించిన బీజేపీకి మేయర్, డిప్యూటీ మేయర్ పదవి దక్కకుండా మంత్రులు, బీఆర్ఎస్, ఎంఐఎంతో కలిసి మీరు చేయని కుట్రలు లేవు. అయినా బండి సంజయ్  రాజకీయం ముందు, బీజేపీ సైనికుల పోరాట పటిమ ముందు మీ కుట్రలన్నీ పటాపంచులైనయ్. క్రికెట్ లో ఇండియాపై పాకిస్తాన్ ఘన విజయం సాధించినట్లుగానే, కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల కబడ్డీ ఆటలో… మీ అందరినీ ఓడించి బీజేపీ కప్ గెలుకుంది” అంటూ చెప్పుకొచ్చారు.