ఎన్నికల ముందు రూ 9.12 లక్షల కోట్లతో యూపీ బడ్జెట్

ఎన్నికల ముందు రూ 9.12 లక్షల కోట్లతో యూపీ బడ్జెట్
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.9.12 లక్షల కోట్ల రికార్డు బడ్జెట్‌ను సమర్పించింది. ఇది రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద బడ్జెట్, ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించిందని ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు చివరి పూర్తి బడ్జెట్‌గా చూస్తున్నారు.
 
రూ.9,12,696.35 కోట్ల వ్యయం గత ఆర్థిక సంవత్సరం కంటే దాదాపు 12.2 శాతం ఎక్కువగా ఉందని, ఇది రాష్ట్రంలో సమర్పించిన “ఇప్పటివరకు అతిపెద్ద బడ్జెట్” అని ఖన్నాతెలిపారు. మూలధన వ్యయం మొత్తం బడ్జెట్‌లో 19.5 శాతంగా ఉందని మంత్రి చెప్పారు. కేంద్రం ఆమోదించిన 16వ కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా, 2026-27 సంవత్సరానికి ఆర్థిక లోటు పరిమితిని మూడు శాతంగా నిర్ణయించారు. ఇది 2030-31 వరకు వర్తిస్తుంది. 
 
విద్య, ఆరోగ్యానికి కేటాయింపులు మొత్తం బడ్జెట్‌లో వరుసగా 12.4 శాతం,  ఆరు శాతంగా ఉన్నాయి. వ్యవసాయం, అనుబంధ సేవలకు మొత్తం వ్యయంలో తొమ్మిది శాతం కేటాయించారు. శాంతిభద్రతలను బలోపేతం చేయడం ప్రధాన ప్రాధాన్యతగా ఉందని నొక్కి చెబుతూ, నివాసేతర పోలీసు భవనాల నిర్మాణానికి రూ. 1,374 కోట్లు, నివాస భవనాలకు రూ. 1,243 కోట్లు ప్రతిపాదించినట్లు ఖన్నా చెప్పారు. 
 
వైద్య విద్య కోసం, రూ. 14,997 కోట్లు కేటాయింపు ప్రతిపాదించారు. ప్రస్తుతం, రాష్ట్రంలో 81 వైద్య కళాశాలలు ఉన్నాయి. వాటిలో 45 రాష్ట్ర ప్రభుత్వం, 36 ప్రైవేట్ రంగం నిర్వహిస్తున్నాయి. 14 కొత్త వైద్య కళాశాలల స్థాపనకు రూ. 1,023 కోట్లు ప్రతిపాదించారు. అదనంగా, లక్నోలోని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు రూ.315 కోట్లు, నయం కాని వ్యాధులకు ఉచిత చికిత్స అందించడానికి రూ.130 కోట్లు కేటాయించారు. 
 
వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ.37,956 కోట్లు ప్రతిపాదించామని ఖన్నా చెప్పారు. ఇది గత సంవత్సరం కంటే 15 శాతం ఎక్కువ. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కు దాదాపు రూ.8,641 కోట్లు, ఆయుష్మాన్ భారత్ జాతీయ ఆరోగ్య రక్షణ పథకానికి రూ.2,000 కోట్లు, ఆయుష్ సేవలకు దాదాపు రూ.2,867 కోట్లు కేటాయించారు. 
 
మౌలిక సదుపాయాలు,  పారిశ్రామిక అభివృద్ధి కోసం, రూ.27,103 కోట్లు ప్రతిపాదించారు. ఇది 2025-26 కంటే 13 శాతం ఎక్కువ. ముఖ్యమంత్రి పారిశ్రామిక ప్రాంత విస్తరణ, కొత్త పారిశ్రామిక ప్రాంత ప్రమోషన్ పథకానికి రూ.5,000 కోట్లు కేటాయించారు. స్వామి వివేకానంద యువ సశక్తీకరణ్ యోజన కింద, టాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్‌ల పంపిణీ జరుగుతోంది. దీని కోసం రూ.2,374 కోట్లు ప్రతిపాదించారు.
 
మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద రూ. 2,000 కోట్లు కేటాయించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫార్చ్యూన్ 500 కంపెనీల నుండి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ప్రోత్సాహక విధానం 2023 అమలు కోసం ప్రభుత్వం రూ. 1,000 కోట్లు కూడా అందించింది. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టుపై, ఇప్పటివరకు 200 రక్షణ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటి ద్వారా రూ. 35,280 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడి, 53,263 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించవచ్చని మంత్రి తెలిపారు. 
 
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) రూ. 3,822 కోట్లు అందించారు. ఇది గత సంవత్సరం కంటే 19 శాతం ఎక్కువ. రూ. 575 కోట్ల వ్యయంతో కొత్త సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉపాధి, పారిశ్రామిక జోన్ పథకాన్ని ప్రతిపాదించారు. ‘వన్ డిస్ట్రిక్ట్, వన్ డిష్’ అనే కొత్త పథకానికి రూ.75 కోట్ల కేటాయింపు ప్రతిపాదించారు. చేనేత, వస్త్ర రంగానికి దాదాపు రూ.541 కోట్లు ప్రతిపాదించారు. ఇది గత సంవత్సరం కేటాయింపు కంటే ఐదు రెట్లు ఎక్కువ.
 
2026-27లో వస్త్ర రంగంలో 30,000 ఉద్యోగాలను సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోరఖ్‌పూర్‌లోని దుప్పటి ఉత్పత్తి కేంద్రాన్ని ఆధునీకరించడానికి రూ.7.5 కోట్లతో కొత్త పథకాన్ని ప్రతిపాదించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ పథకాలకు రూ.2,059 కోట్లు కేటాయించామని, ఇది గత సంవత్సరం కంటే 76 శాతం ఎక్కువ అని ఖన్నా చెప్పారు. కృత్రిమ మేధస్సు రంగంలో అభివృద్ధి కోసం రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఏఐ మిషన్‌ ప్రారంభించేందుకు  రూ.225 కోట్లు ప్రతిపాదించారు. 
 
ఖన్నా తన ప్రసంగంలో, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మూలధన పెట్టుబడి, మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలక పాత్ర పోషిస్తాయని నొక్కి చెప్పారు. రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలను అందించడం, వారికి అవసరమైన నైపుణ్యాలను అందించడం కూడా అంతే ముఖ్యమైనదని పేర్కొన్నారు. ఏదైనా వ్యాపారంలో సాంకేతిక నైపుణ్యాలు లేదా నైపుణ్యం ఉన్న వ్యక్తులు “నిరుద్యోగులుగా మిగిలిపోయే అవకాశం లేదు” అని ఆయన పేర్కొన్నారు.
 
ఈ లక్ష్యంతో, పెద్ద ఎత్తున ఉపాధి ఆధారిత శిక్షణ, నైపుణ్య పెంపుదల కార్యక్రమాలు ప్రాధాన్యతా ప్రాతిపదికన మిషన్ మోడ్‌లో నిర్వహిస్తారు. అధికారిక విద్యతో పాటు, యువత నైపుణ్య స్థావరాన్ని బలోపేతం చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. 
 
ఇప్పటికే ఉన్న నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రాల సామర్థ్యాన్ని పెంచడం, రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రచారంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కూడా ఉంటుంది.  ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) పద్ధతిలో వివిధ జిల్లాల్లో నైపుణ్య అభివృద్ధి, ఉద్యోగ నియామక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.