కెనడా స్కూల్లో కాల్పులు.. నిందితుడితో సహా 10 మంది మృతి!

కెనడా స్కూల్లో కాల్పులు.. నిందితుడితో సహా 10 మంది మృతి!
కెనడాలో కాల్పుల కలకలం రేపాయి. బ్రిటష్ కొలంబియాలో పాఠశాలలో ఓ దుండుగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది గాయపడ్డారు. మృతుల్లో ఈ ఘటనకు కారణమైన నిందితుడు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, ఈ ఘటన టుంబ్లెర్‌ రిడ్జ్‌ సెకండరీ పాఠశాలలో స్థానిక కాలమాన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు జరిగింది. 
 
స్కూల్​ లోపల ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు వెల్లడించారు. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండా మరణించాడని తెలిపారు. స్కూల్​ సమీపంలోని ఓ ఇంట్లో మరో రెండు మృతదేహాలు గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే వీరు కూడా స్కూల్‌లో జరిగిన కాల్పుల ఘటనతో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇక కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా తనను తాను కాల్చుకుని మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది. కాల్పుల ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు షూటర్​ను గుర్తించినట్లు చెప్పారు. గోధుమ రంగు జుట్టు కలిగి, దుస్తులు ధరించిన ఓ మహిళగా ప్రాథమికంగా గుర్తించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. 

పాఠశాల లోపల కాల్పులకు తెగబడిన అనంతరం, ఆమె తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి మరింత విషమంగా ఉంది. దీంతో వారికి హెలికాప్టర్​ ద్వారా ఆస్పత్రికి తరలించారు. మిగిలి వారికి స్థానిక వైద్య కేంద్రంలోనే చికిత్సను అందిస్తున్నారు. 

వీరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు స్థానిక వార్త సంస్థలు పేర్కొన్నాయి. అయితే గాయపడిన వారు మరెక్కడైనా ఉన్నారేమోనని తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఇటీవల కెనడాలోని టొరంటోలో శనివారం దుండగులు జరిగిన కాల్పులో బెంగళూరుకు చెందిన టెకీ చందన్ కుమార్ మృతి చెందారు. 

శనివారం మధ్యాహ్నం 3.31 గంటలకు టొరంటో పరిధిలోని ఓ షాపింగ్‌ సెంటర్‌లో కాల్పులు జరిగినట్లు టొరంటో పోలీసు సర్వీస్‌(టీపీఎస్‌)కు ఫోన్‌కాల్‌ వచ్చింది. వారు అక్కడికి వెళ్లేసరికే ఓ వాహనంలో శరీరమంతా బుల్లెట్‌ గాయాలతో చందన్‌కుమార్‌ కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించారు. దుండగులు ముందుగా అనుకున్న కుట్రలో భాగంగానే ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.