స్పీక‌ర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం?

స్పీక‌ర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం?
లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టేందుకు విప‌క్షాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే నివాసంలో జ‌రిగిన విప‌క్ష స‌భ్యుల భేటీలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. లెఫ్ట్ ఫ్రంట్ ఎంపీ ఎన్‌కే ప్రేమ్‌చంద్ర‌న్ ఈ విష‌యాన్ని నిర్ధారించారు.
 
మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణె పుస్తకంపై రాహుల్ గాంధీని మాట్లాడనివ్వనందుకు నిరసనగానే ఇలా చేస్తున్నట్లు సమాచారం. ఇంకా ప్రచురించనిఎంఎం నరవణె పుస్తకంపై సభలో మాట్లాడేందుకు రాహుల్‌కు అవకాశాన్ని ఇచ్చేది లేదని ఓంబిర్లా తేల్చి చెప్పారు. దీంతో పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై, లోక్‌సభలో జరిగిన చర్చలో మాట్లాడే అవకాశాన్ని విపక్ష నేత రాహుల్ గాంధీ కోల్పోయారు.

ఫిబ్రవరి 5న సాయంత్రం పార్లమెంటును ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించాల్సి ఉంది. అయితే అదే రోజు ఉదయం స్పీకర్ ఓంబిర్లా రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించేందుకు పార్లమెంటుకు రావొద్దని తాను ప్రధాని మోదీని కోరాననిసభలో చెప్పారు. కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని మోదీ సీటు వద్దకు వెళ్లి, ఆయనతో అమర్యాదగా ప్రవర్తించాలని అనుకున్నారనే  సమాచారం తనకు అందిందని ఆరోజున స్పీకర్ తెలిపారు.

ఈ రెండు అంశాలను తీవ్రంగా పరిగణిస్తున్న విపక్షాలు స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎంపీలు సోమవారం రోజు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు అధికార పార్టీ బీజేపీ ఒత్తిడి వల్ల  తమపై ఆయన నిరాధారణ, తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ ఓ లేఖను వ్రాసారు. స్పీకర్ చేసిన ఆరోపణలు విపక్ష మహిళా ఎంపీల పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని తెలిపారు. 

విపక్ష ఎంపీల పార్లమెంటరీ హక్కులను కాలరాసేలా స్పీకర్ ఓంబిర్లా వ్యవహరిస్తున్నారని ఆ లేఖలో ఎంపీలు ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు ఇలా చేయడం సరికాదని పేర్కొన్నారు.  కాగా, కాంగ్రెస్ ఎంపీలే లోక్‌సభ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు.

కొందరు కాంగ్రెస్ ఎంపీలు నేరుగా స్పీకర్ ఓంబిర్లా ఛాంబర్‌లోకి దూసుకెళ్లారని, వాళ్లంతా ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష ఎంపీల వ్యవహార శైలిని ఖండించడానికి కొన్ని పదాలు సరిపోవవని తెలిపారు. స్వయంగా కాంగ్రెస్ అగ్రనేతే స్వీయ నియంత్రణలో లేనప్పుడు, లోక్‌సభ స్పీకర్ ఏది చేస్తే అదే కరెక్టు అవుతుందని రిజిజు తేల్చి చెప్పారు.