యూ-19 ప్రపంచ కప్ విజేతలకు బీసీసీఐ భారీ నజరానా

యూ-19 ప్రపంచ కప్ విజేతలకు బీసీసీఐ భారీ నజరానా

2026 అండర్ 19 వరల్డ్​కప్ ఛాంపియన్​గా నిలిచిన యువ భారత్​కు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టోర్నీ విజేత టీమ్ఇండియాకు రూ.7.5 కోట్ల భారీ ప్రైజ్​మనీ ఇవ్వనున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు. ఈ టోర్నీలో యువ భారత్ అద్భుతంగా ఆడిందని, ఒక్క ఓటమి లేకుండా ఛాంపియన్​గా నిలవడం గొప్ప విషయమని సైకియా అభినందించారు.

‘ఈరోజు ఛాంపియన్​గా నిలిచిన అండర్ 19 జట్టును చూసి బీసీసీఐ మాత్రమే కాదు, యావత్ దేశం గర్వంగా ఉంది. మన కుర్రాళ్లు ఫైనల్​లో ఇంగ్లాండ్​ను మట్టికరిపించడం, టోర్నీ ఆసాంతం ఓటమే లేకుండా టైటిల్ నెగ్గడం నిజంగా మనందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా యువ జట్టుకు ప్రోత్సాహకంగా బీసీసీఐ నుంచి రూ.7.5 కోట్ల భారీ ప్రైజ్​మనీ అందించాలని నిర్ణయించాం’ అని సైకియా మీడియాతో వెల్లడించారు.

అంతకుముందు అండర్ 19 నెగ్గిన టీమ్ఇండియాపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ‘క్రికెట్​తో భారత ప్రతిభ ప్రకాశిస్తోంది. వరల్డ్​కప్ నెగ్గిన అండర్ 19 జట్టు పట్ల గర్వంగా ఉంది. మన యువ జట్టు టోర్నమెంట్ ఆసాంతం అద్భుతంగా ఆడి, అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ విజయం చాలా మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది’ అని మోదీ ట్వీట్ చేశారు.