భారత్‌తో ఆడాల్సిన మ్యాచ్ పాక్ బహిష్కరణ

భారత్‌తో ఆడాల్సిన మ్యాచ్ పాక్ బహిష్కరణ
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో ఆడాల్సిన మ్యాచ్ బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ఈ మేరకు పాకిస్థాన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15వ తేదీన టీమ్‌ఇండియాతో ఆడాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రపంచకప్ టోర్నీలో మిగతా మ్యాచ్‌లను ఆడాలని నిర్ణయం తీసుకుంది. 
 
పాకిస్థాన్ ప్రభుత్వం అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ఈ మేరకు ట్వీట్ చేశారు. టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీన కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ బహిష్కరించాలని పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి భారతదేశంతో పాటుగా, శ్రీలంక ఆతిథ్యమివ్వనున్నాయి. 
 
భారత్‌లో మ్యాచులు ఆడేందుకు పాకిస్థాన్ ముందుకు రాకపోవటంతో పాకిస్థాన్ మ్యాచ్‌లు కొలంబోలో షెడ్యూల్ చేశారు. అయితే బంగ్లాదేశ్, భారతదేశం మధ్య కొనసాగుతున్న పరిస్థితులు, భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ ముందుకురావటంతో స్కాట్లాండ్‌ను ఎంపిక చేసిన పరిణామాలు, బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ నిలుస్తున్న పరిస్థితుల నేపథ్యంలో పొట్టికప్పులో దాయాది దేశం పాల్గొంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 
 
ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్ కోసం కొలంబో వెళ్లేందుకు పాకిస్థాన్ జట్టుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అయితే ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో పాక్ జట్టు మైదానంలోకి దిగదంటూ ట్వీట్‌లో పాకిస్థాన్ ప్రభుత్వం పేర్కొంది.  అయితే భారత్‌‍తో మ్యాచ్ ఎందుకు బాయ్‌కాట్ చేస్తున్నామనే దానిపై సరైన కారణాలను వెల్లడించలేదు. 
 
మరోవైపు ఐసీసీ టోర్నీలలో భారత్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికులకు పండగనే చెప్పొచ్చు. రెండు దేశాల మధ్య సుమారుగా 14 ఏళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలలోనే భారత్, పాక్ తలపడుతున్నాయి.  ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌కు ప్రపంచవ్యాప్తంగా లభించే ప్రేక్షకాదరణను దృష్టిలో పెట్టుకుని ఐసీసీ కూడా 2012 నుంచి ప్రతి ఐసీసీ ఈవెంట్లలో భారత్, పాక్ తలపడేలా ఒకే గ్రూపులో ఉంచుతోంది. 
 
అయితే ఈసారి మాత్రం ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడబోమని పాక్ ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం గ్రూప్ స్టేజ్ వరకూ మాత్రమే పరిమితమా? రెండు జట్లూ నాకౌట్ దశకు చేరుకుంటే ఎలా వ్యవహరిస్తారనేది ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, మ్యాచ్‌ను బహిష్కరించాలనే వారి నిర్ణయం వల్ల గ్రూప్ ఏ లో భారత్‌కు రెండు పాయింట్లు లభిస్తాయి.
 
పాకిస్థాన్, భారత్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియాలతో పాటు గ్రూప్ ఏ లో ఉంది. పాకిస్థాన్ ఈ రెండు పాయింట్లను కోల్పోతే, తదుపరి దశకు వారి ప్రయాణం కూడా ప్రమాదంలో పడవచ్చు. గత టీ20 ప్రపంచ కప్ గ్రూప్ దశలో పాకిస్థాన్ తమ గ్రూప్ మ్యాచ్‌లో యూఎస్ఏ చేతిలో ఓడిపోయింది, అలాగే భారత్ చేతిలో కూడా ఓటమి పాలైంది. దీనివల్ల యూఎస్ఏ తదుపరి దశకు చేరుకోగా, పాకిస్థాన్ ప్రపంచ కప్ నుండి ముందుగానే నిష్క్రమించాల్సి వచ్చింది.
 
ఈ టోర్నమెంట్ రాబోయే ఎడిషన్‌లో బహిష్కరణ పాకిస్థాన్‌పై మరింత ఒత్తిడిని పెంచుతుంది. సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని జట్టు తమ మ్యాచ్‌లన్నీ కొలంబోలో ఆడనుంది. వారు ఫిబ్రవరి 7న కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో నెదర్లాండ్స్‌తో తమ టోర్నమెంట్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 10న అదే వేదికపై యూఎస్ఏతో తలపడతారు. వారి మూడవ మ్యాచ్ ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్‌తో జరగాల్సి ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరి 18న సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో నమీబియాతో చివరి గ్రూప్ దశ మ్యాచ్ ఆడతారు.