ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వీసా దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమాల ఖాతాలను తనిఖీ చేయడాన్ని తప్పనిసరి చేస్తూ 2025 డిసెంబర్ 15న కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో హెచ్-1బీ వీసా దరఖాస్తుల ఇంటర్వ్యూల వాయిదాల పర్వం ప్రారంభమైంది. ఇండియన్ నేషనల్స్ వేరొక దేశంలో వీసా స్టాంపింగ్ చేయించుకునేవారు.
దీనికి అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ తెర దించింది. ఫలితంగా మన దేశంలోని కాన్సులేట్లపైన దరఖాస్తుదారులు ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఇంటర్వ్యూలు జరుగుతాయని ఆశించిన దరఖాస్తుదారులకు ఏప్రిల్, మే నెలల్లో లేదా 2027లో ఇంటర్వ్యూలు జరుగుతాయంటూ ఈ-మెయిల్స్ వస్తున్నాయి.
ఈ విధంగా వాయిదా పడటం మునుపెన్నడూ జరగలేదని ఇమిగ్రేషన్ లాయర్లు చెప్తున్నారు. వేలాది మంది ఇండియన్ హెచ్-1బీ హోల్డింగ్ ప్రొఫెషనల్స్ వీసా స్టాంపింగ్ కోసం భారత దేశానికి వచ్చారు. ఈ జాప్యాల వల్ల వీరు తిరిగి అమెరికాకు వెళ్లలేకపోతున్నారు. ప్రకటిత ఇంటర్వ్యూ తేదీలు పదే పదే మారుతుండటమే దీనికి కారణం.
వీసా అపాయింట్మెంట్లలో జాప్యం, ఇంటర్వ్యూల రీషెడ్యూల్పై పలువురు దరఖాస్తుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై కాన్సులేట్లో అపాయింట్మెంట్లను వచ్చే సంవత్సరం మే 24వ తేదీకి వాయిదా వేశారని కొందరు దరఖాస్తుదారులు తెలిపారు. అమెరికా నుంచి వెళ్లినవారిని తిరిగి రానివ్వకుండా చేయడానికే ఈ విధంగా వాయిదాలు వేస్తున్నారా? అనే సందేహాలను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
కొందరు హెచ్-1బీ హోల్డర్స్ భారత దేశంలో చిక్కుకుపోగా, వారి భార్య/భర్త, పిల్లలు అమెరికాలో ఉండిపోయారు. హెచ్-1బి వీసాదారులు అమెరికా వెలుపలే ఉన్నట్లయితే పొడిగింపుల కోసం దరఖాస్తు చేసుకోవడంలో యాజమాన్యాలు ఇబ్బంది పడతాయి. దీర్ఘకాల జాప్యం కారణంగా అటు ఉద్యోగులలో కూడా అనిశ్చితి, ఒత్తిడి పెరుగుతోంది. రొటీన్గా జరిగే వీసా ప్రక్రియ కూడా చాలా కాలం పాటు సాగుతుండడంతో దీనికి అంతం ఎప్పుడో తెలియని పరిస్థితి నెలకొంది.

More Stories
అమెరికా టారిఫ్ల వేళ భారత్ కు కెనడా ప్రధాని
జాతీయ గీతంతో సమానంగా ‘వందేమాతరం’
భారత్ విజయం ప్రపంచాన్ని స్థిరంగా మారుస్తుంది