గౌహతి- కోల్‌కతాల మధ్య తొలి వందే భారత్ స్లీపర్

గౌహతి- కోల్‌కతాల మధ్య తొలి వందే భారత్ స్లీపర్

రైలు ప్రయాణికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలి రైలు గౌహతి-కోల్‌కతా మధ్య అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌  ప్రకటించారు. ఈ రైలు సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  జెండా ఊపి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

“వందే భారత్‌ స్లీపర్‌ రైలు టెస్ట్‌ డ్రైవ్‌ పూర్తైంది. త్వరలో ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. తొలి రైలు గౌహతి- కోల్‌కతాల మధ్య అందుబాటులోకి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ మార్గంలో వందే భారత్‌ స్లీపర్‌ రైలు సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారు” అని రైల్వే మంత్రి తెలిపారు.  వందే భారత్‌ స్లీపర్‌.. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మెరుగైన భద్రత, రాత్రిపూట సుదూర ప్రయాణాలకు ఆధునిక ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని ఆయన చెప్పారు.

జనవరి 18-19 తేదీల్లో ఈ ప్రారంభోత్సవం ఉండొచ్చని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ రైళ్లు ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో తీస్తున్నాయి. 2019లో ప్రారంభించిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ క్రమంలో రైల్వేశాఖ స్లీపర్‌ వర్షన్‌ అందుబాటులోకి తెచ్చింది. ఈ వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు మరికొన్ని రోజుల్లో పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతోంది. 

ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ రైలుకు ట్రయల్ రన్స్‌ చేపడుతున్నారు. రైలు వేగాన్ని పెంచేందుకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాజస్థాన్‌ కోటా-నాగ్దా సెక్షన్ల మధ్య ట్రయల్స్‌ నిర్వహించారు. ఈ ట్రయల్స్‌ విజయవంతమైనట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.  ఈ పరీక్షల్లో రైలు గరిష్ఠంగా గంటకు 182 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఈ హైస్సీడ్‌లో వాటర్‌ టెస్ట్‌ కూడా నిర్వహించారు.

రైలు హైస్పీడ్‌తో దూసుకెళ్తున్నప్పటికీ నీళ్లతో నిండుగా ఉన్న గ్లాసులు మాత్రం తొణకకుండా స్థిరంగా ఉన్నట్టు వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. బెంగాల్‌లోని హౌరా, అస్సాంలోని గువహటిల మధ్య నడిచే ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ టికెట్ ధరలు విమాన టికెట్లకంటే చాలా తక్కువగా ఉంటాయని అన్నారు. వందే భారత్ స్లీపర్ ట్రైన్ టికెట్ ధరల విషయానికి వస్తే.. నాన్ ఏసీ టికెట్ ధర 2,300 రూపాయలు ఉంటుంది. అందులోనే ఆహారం కూడా అందిస్తారు. 

సెకండ్ ఏసీ టికెట్ ధర 3000 రూపాయలు ఉంటుంది. ఫస్ట్ ఏసీ టికెట్ ధర 3,600 రూపాయలు ఉంటుంది. అదే విమానంలో అయితే హౌరా ఎయిర్ ట్రావెల్స్ ధర 6 వేల రూపాయల నుంచి 8 వేల రూపాయల వరకు ఉంటుంది.