టీ20 ప్రపంచ కప్ భారత జట్టుకు శుభ్‌మన్ గిల్ దూరం

టీ20 ప్రపంచ కప్ భారత జట్టుకు శుభ్‌మన్ గిల్ దూరం
టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా టోర్నీలో జట్టును నడిపించనున్నాడు. ఈ జట్టుకు ఆల్రౌండర్ అక్షర్‌ పటేల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే వైస్కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ ను ఈ టోర్నీకి ఎంపిక చేయలేదు. అటు యశస్వీ జైస్వాల్ కు కూడా నిరాశే మిగిలింది. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ ఈ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
 
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ శనివారం టీ20 ప్రపంచ టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఇదే జట్టు జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో కూడా ఆడనుంది.  రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ 2024లో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. ఈ ఇది టోర్నమెంట్ 10వ ఎడిషన్. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు ఏ జట్టు కూడా టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయాయి. 
 
సొంత గడ్డపై ఈ రికార్డును బద్దలు కొట్టాలని టీమిండియా కృతనిశ్చయంతో ఉన్నది.  మొన్నటి వరకు వైస్‌ కెప్టెన్‌గా కొనసాగిన శుభ్‌మన్ గిల్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మెన్‌ ఇషాన్ కిషన్, రింకు సింగ్ జట్టులోకి తిరిగి వచ్చారు. ఇషాన్ చివరిగా 2023 నవంబర్ 28న ఆస్ట్రేలియాపై భారత్ తరఫున చివరి మ్యాచ్‌ ఆడాడు. రింకు సింగ్‌ చివరిసారిగా ఆసియా కప్‌లో ఆడాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో మాత్రం చోటు దక్కలేదు.

ఈ ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్‌ జరుగనున్నది. భారత్-శ్రీలంక సంయుక్తంగా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇప్పటికే ఐసీసీ వేదికలను ఖరారు చేసింది. టీమిండియా టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న ముంబయిలో యూఎస్‌ఏతో ఆడుతుంది.  ఆ తర్వాత ఫిబ్రవరి 12న నమీబియాతో ఢిల్లీలో ఆడుతుంది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్‌ ప్రేమదాస స్టేడియంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడుతుంది.

అనంతరం ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లోని భారీ నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో చివరి గ్రూప్‌ మ్యాచ్‌ ఆడుతుంది. టీమ్ఇండియా వరల్డ్​కప్ జట్టు – అభిషేక్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), సంజు శాంసన్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్‌ ( వైస్‌ కెప్టెన్‌), రింకు సింగ్‌, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, వాషింగ్టన్‌ సుందర్‌, ఇషాన్‌ కిషన్‌, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి