ఉత్తర ప్రదేశ్లో కేవలం బురఖా వేసుకోలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన కుటుంబాన్నే కడతేర్చాడు. ముఖ్యంగా విపరీతమైన కోపంతో భార్యను, ఆమెకు తోడుగా ఉన్నారని ఇద్దరు అభంశుభం తెలియని కుమార్తెలను దారుణంగా హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా తన ఇంట్లోనే పాతిపెట్టిన ఉదంతం స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
శామ్లీ జిల్లాకు చెందిన ఫరూక్కు 35 ఏళ్ల భార్య తాహిరా, ఇద్దరు కుమార్తెలు షరీన్ (14), ఆఫ్రీన్ (6)లు ఉన్నారు. గత వారం రోజులుగా వీరు ముగ్గురూ కనిపించకుండా పోయారు. దీనిపై గ్రామ సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ ప్రారంభం అయింది. ఫరూక్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది.
తన భార్య, పిల్లలను తానే చంపి ఇంట్లో గోతి తీసి పూడ్చి పెట్టినట్లు నిందితుడు అంగీకరించాడు. నెల రోజుల క్రితం భార్యాభర్తల మధ్య డబ్బు విషయంలో గొడవ జరిగింది. ఆ సమయంలో తాహిరా కోపంతో బురఖా ధరించకుండానే తన పుట్టింటికి వెళ్లిపోయింది. బహిరంగంగా బురఖా లేకుండా వెళ్లడం వల్ల తన పరువు పోయిందని భావించిన ఫరూక్ దీనిని తీవ్ర అవమానంగా భావించాడు.
నెల రోజుల తర్వాత భార్యను తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. మంగళవారం రాత్రి గొడవ పడి తన వద్ద ఉన్న పిస్టల్తో భార్యను, ఇద్దరు కుమార్తెలను కాల్చి చంపాడు. అనంతరం ఎవరికీ తెలియకుండా ఇంటి లోపలే గొయ్యి తీసి వారి మృతదేహాలను పాతిపెట్టాడు. శామ్లీ ఎస్పీ ఎన్పి సింగ్ నేతృత్వంలోని పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు చూపించిన చోట మృతదేహాలను వెలికితీశారు.
హత్యకు ఉపయోగించిన పిస్టల్తో పాటు బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు ఫరూక్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ట్రిపుల్ మర్డర్ కేసును గృహహింస, పరువు హత్య కోణంలో విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

More Stories
ఢిల్లీ గాలి కాలుష్యంపై నాలుగు వారాల్లో ‘యాక్షన్ ప్లాన్’
సరిహద్దులో కాల్పులకు తెగబడి తోకముడిచిన పాక్
జార్ఖండ్లో ఏనుగు బీభత్సం.. 22 మంది మృతి