బాధితురాలు ఇంట్లో ఐసోలేషన్లో ఉంటే సరిపోతుందని బీమా సంస్థ క్లెయిమ్ను తిరస్కరించింది. దీనిపై వినియోగదారుల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సేవలో లోపమని కమిషన్ స్పష్టం చేసింది. వైద్య చికిత్స విధానాన్ని లేదా పద్ధతిని నిర్ణయించే అధికారం బీమా సంస్థకు లేదని తేల్చి చెప్పింది.
బీమా సంస్థ ఇప్పుడు దాదాపు రూ.50,000 మొత్తాన్ని సహా 6 శాతం వార్షిక వడ్డీతో పాటు రూ.2,000 వ్యాజ్య ఖర్చులను చెల్లించాలని స్టార్ హెల్త్ను కమిషన్ ఆదేశించింది. ఈ మొత్తాన్ని 30 రోజులలోపు చెల్లించాలని స్పష్టం చేసింది. రోగికి కరోనా లక్షణాలు లేని కారణంగా రోగికి ఇంట్లోనే చికిత్స అందించాల్సిందని, కాబట్టి ఆసుపత్రిలో చేరడం అవసరం లేదని స్టార్ హెల్త్ క్లెయిమ్ తిరస్కరించింది.
దాద్రీ నివాసి అయిన నీతూ నగర్ 2022 సెప్టెంబర్ 1న జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (డిసిడిఆర్)కి ఫిర్యాదు చేశారు. నీతూనగర్ తెలిపిన వివరాల ప్రకారం ఆమెకు తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చేరారు. పాలసీ నిబంధనల ప్రకారం ఆసుపత్రిలో చేరడానికి ముందే బీమా సంస్థకు సమాచారం ఇచ్చారు.
కొన్ని రోజుల్లో క్యాష్లెస్ క్లెయిమ్ ఆమోదించబడుతుందని కుటుంబానికి చెప్పారు. ఆసుపత్రి డిశ్చార్జ్ తర్వాత బిల్లులను చెల్లించడానికి స్టార్ హెల్త్ నిరాకరించింది. మొత్తం ఖర్చు రూ.49,423 కావడంతో కుటుంబం ఆ మొత్తాన్ని తమ సొంత డబ్బుతో చెల్లించి, రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసింది.
దీంతో వారు కమిషన్ను ఆశ్రయించగా బీమా సంస్థ వాదనను కమిషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ పుండిర్, సభ్యురాలు అంజు శర్మ తిరస్కరించారు. వైద్యుల నిర్ణయాన్ని బీమా సంస్థ ఎలా కొట్టిపారేస్తుందని స్పష్టం చేశారు. ”వైద్య నిపుణులు ఆసుపత్రిలో చేరడం అవసరమని సూచించినప్పుడు చికిత్సను ఇంట్లోనే చేయాలని బీమా సంస్థ పట్టుబట్టకూడదు. రోగి ఇంట్లో ఐసోలేషన్లో చికిత్స పొందాల్సిందనే కారణంతో క్లెయిమ్ను తిరస్కరించడం సేవల్లో లోపమే.” అని తేల్చారు.

More Stories
ఒక్కరోజే 550కు పైగా ఇండిగో విమానాల రద్దు
పొగాకు, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం
సిబ్బంది కొరతతో 200 ఇండిగో విమానాలు రద్దు