దేశీయ విమానయాన సంస్థ ఇండిగో చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరుసగా మూడో రోజు కార్యకలాపాల్లో అంతరాయాలు కొనసాగడంతో గురువారం ఒక్కరోజే 550కు పైగా విమానాలను రద్దు చేసింది. దాదాపు 20 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఎయిర్లైన్కు ఇది అతిపెద్ద రద్దుల ఘటనగా పేర్కొనవచ్చు. కేబిన్ క్రూ లోపాలు, సాంకేతిక సమస్యలు వంటి పలు కారణాలతో ఇండిగో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఆపరేషన్స్ను సరిచేయడానికి ముందుగానే ప్లాన్ చేసిన కొన్ని సేవల రద్దులను షెడ్యూల్లో చేర్చినట్లు కంపెనీ తెలిపింది.
వచ్చే రెండు–మూడు రోజుల పాటు మరిన్ని విమానాలు రద్దయ్యే అవకాశముందని కూడా ఇండిగో స్పష్టం చేసింది. రోజువారీ సగటున 2,300 విమానాలు నడిపే ఇండిగో, సమయపాలన వైవిధ్యానికి పేరుగాంచింది. అయితే బుధవారం కంపెనీ ఆన్టైమ్ పర్ఫార్మెన్స్ కేవలం 19.7 శాతానికి పడిపోయింది. ఇది మంగళవారం నమోదైన 35 శాతంతో పోలిస్తే భారీ పతనమే.
ఈ పరిణామాల నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, నియంత్రణ సంస్థ డీజీసీఏ అధికారులు ఇండిగో సీనియర్ మేనేజ్మెంట్తో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. సమస్యకు పరిష్కారం కనుగొనడంపై చర్చించారు. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ఉద్యోగులతో మాట్లాడుతూ, కార్యకలాపాలను సాధారణ స్థాయికి తీసుకురావడం, సమయపాలనను తిరిగి సాధించడం అంత సులభం కాదని తెలిపారు.
విమాన రద్దులు ముంబైలో 118, బెంగళూరులో 100, హైదరాబాద్లో 75, కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11గా నమోదయ్యాయని ఓ వార్తాసంస్థ వెల్లడించింది. ఇతర విమానాశ్రయాల్లోనూ పలుచోట్ల రద్దులు చోటుచేసుకున్నాయి. కొత్త నిబంధనల కింద క్రూ అవసరాలను తప్పుడు అంచనా వేసామని, ప్లానింగ్ లోపాల వల్ల సరైన సంఖ్యలో సిబ్బంది అందుబాటులో లేకపోయారని ఇండిగో అంగీకరించింది.
శీతాకాల వాతావరణ ప్రభావం, విమానాశ్రయాల్లో గిరాకీ పెరగడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయని తెలిపింది. రాత్రి విధుల నిర్వచనంలో మార్పులు, ల్యాండింగ్ పరిమితుల వంటి నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్ డి టి ఎల్) ఫేజ్–2 అమలులో ఎదురైన మార్పుల వల్లే ఈ అంతరాయాలు చోటుచేసుకున్నాయని ఇండిగో డిజిసిఏకు వివరించింది. కొత్త నిబంధనలు పైలట్ల అలసట నియంత్రణ, భద్రత లక్ష్యంగా తీసుకొచ్చినప్పటికీ, క్రూ రోస్టరింగ్లో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయని సంస్థ పేర్కొంది.

More Stories
ఓలా, ఉబర్కు పోటీగా ‘భారత్ ట్యాక్సీ’
త్వరలో అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్ప్రెస్, శంఖ్ విమాన సేవలు
రూ.12 వేల కోట్లతో ఢిల్లీ మెట్రో విస్తరణ