బెంగాల్ లో 32 వేల ఉపాధ్యాయములకు హైకోర్టులో ఊరట!

బెంగాల్ లో 32 వేల ఉపాధ్యాయములకు హైకోర్టులో ఊరట!
పశ్చిమబెంగాల్‌లోని 32,000మంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల నియామకాన్ని రద్దు చేస్తూ సింగిల్  బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను కోల్‌కతా హైకోర్టు డివిజన్ బెంచ్   తోసిపుచ్చింది. నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు నిరూపితం కాలేదని, సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులను సమర్థించలేమని జస్టిస్‌ తపబ్రత చక్రవర్తి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం పేర్కొంది.
 
తొమ్మిది సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు తొలగించడం వలన ప్రాథమిక ఉపాధ్యాయులు, వారి కుటుంబాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.ఈ ఉపాధ్యాయులను 2014లో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టిఇటి) తో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వారి నియామకం చేపట్టింది.

సింగిల్‌ బెంచ్‌ రద్దు చేసిన ఆ 32 వేల మంది ప్రైమరీ టీచర్ల నియామకాలు చెల్లుతాయని పేర్కొంది. 32 వేల ప్రైమరీ టీచర్ల నియామకాల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు బెంగాల్ విద్య మంత్రి బ్రత్య బసు పేర్కొన్నారు. ఆ 32 వేల మంది ప్రైమరీ టీచర్ల ఉద్యోగాలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని పేర్కొంటూ టీచర్లకు, ప్రాథమిక విద్యామండలికి శుభాకాంక్షలు తెలిపారు.

కాగా 2014 ఉపాధ్యాయ నియామకాల తర్వాత నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ కోర్టులో కేసులు వేశారు. ఈ కేసు విచారణ జరిపిన జస్టిస్ గంగోపాధ్యాయ నేతృత్వంలోని సింగిల్‌ బెంచ్‌ 2023లో 32 వేల మంది ఉపాధ్యాయుల నియామకాలను రద్దుచేసింది. ఆ స్థానాలకు మూడు నెలల్లోపు కొత్త నియామక ప్రక్రియను నిర్వహించాలని బెంగాల్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన జస్టిస్ సుబ్రతా, జస్టిస్ సుప్రతిమ్ భట్టాచార్యలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఉత్తర్వుపై స్టే విధించింది. కొత్త నియామక ప్రక్రియను పూర్తి చేయడానికి రాష్ట్రానికి ఆరు నెలల అనుమతి ఇచ్చింది. స్టేకు వ్యతిరేకంగా ప్రతివాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో సుప్రీంకోర్టు కేసును తుది విచారణ కోసం హైకోర్టుకు తిరిగి పంపింది.

ఈ క్రమంలో తాజాగా కేసు విచారణ జరిపిన హైకోర్టు ఆ 32 వేల మంది టీచర్ల నియామకాలు చెల్లుతాయని తీర్పునిచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెలువడిన ఈ తీర్పు విద్యా రంగంలో అవినీతి కుంభకోణాలపై విమర్శలను ఎదుర్కొంటున్న అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు కొంతమేర ఉపశమనం కలిగించిందని చెప్పవచ్చు.