హైదరాబాద్ టు బెంగళూరు – కర్నూలు మీదుగా బుల్లెట్ ట్రైన్

హైదరాబాద్ టు బెంగళూరు – కర్నూలు మీదుగా బుల్లెట్ ట్రైన్

ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా బుల్లెట్‌ రైలు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని మార్గాల్లో బుల్లెట్‌ ట్రైన్లను నడపాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ముఖ్యంగా హైదరాబాద్‌-బెంగళూరు మార్గాన్ని ఎంపిక చేశారు. అందుకు అనువైన ట్రాక్‌ నిర్మాణానికి మట్టి నమూనాలను సేకరిస్తున్నారు. అదే విధంగా గుంటూరు-గుంతకల్లు, ముద్కేడ్‌-డోన్‌ డబ్లింగ్‌ పనులన్నీ వేగవంతమయ్యాయి. అయితే అమృత్‌ భారత్‌ కింద స్టేషన్ల ఆధునికీకరిస్తున్నారు.

కర్నూలు-బెంగళూరు మధ్య దూరం 427 కి.మీ. మేర ఉంది. ప్రస్తుతం వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో 5.30 గంటలు పడుతోంది. దీని గరిష్ఠ వేగం దాదాపుగా 180 కిలోమీటర్లు అయినప్పటికీ 130 కిలోమీటర్ల వేగంతోనే నడుపుతున్నారు. బుల్లెట్‌ రైలు అందుబాటులోకి వస్తే మాత్రం కర్నూలు నుంచి బెంగళూరు కంటోన్మెంట్‌ స్టేషన్‌కు 1.20 గంటల్లోనే చేరుకోవచ్చు. దీని గరిష్ఠ వేగం గంటకు 350 కి.మీ. అయితే భద్రత కారణాల నేపథ్యంలో 320 కి.మీ. వేగంతోనే నడుపుతారు. ఈ వేగం తట్టుకునేలా అనువైన ట్రాక్ను నిర్మించాల్సి ఉంటుంది.

గుంటూరు-గుంతకల్లు రైలు మార్గంలో డబ్లింగ్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. రూ.3,631 కోట్లు వెచ్చించి 401.47 కి.మీ. మార్గాన్ని బాగు చేస్తున్నారు. 57.738 కి.మీ. మేర పనులు చేయాల్సి ఉంది. తద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇవి పూర్తైతే నంద్యాల నుంచి గుంటూరు, విజయవాడ, గుంతకల్లు వైపు పలు నూతన సర్వీసులను నడిపేందుకు అవకాశం ఉంటుంది.

 ఉత్తర-దక్షిణ భారతదేశ ప్రాంతాలను కలిపే ఉద్దేశంతో ముద్కేడ్‌-డోన్‌ రైల్వే లైన్‌కు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని ముద్కేడ్‌ నుంచి ఏపీలోని డోన్‌ వరకు 417.88 కిలోమీటర్ల మేర రూ.4,686.09 కోట్లతో డబ్లింగ్‌ పనులను చేపడుతున్నారు. పెండింగ్‌లో ఉన్నటువంటి మహబూబ్‌నగర్‌-డోన్‌ మధ్య 197 కి.మీ. మేర పనులు 2029 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇవి ఒకవేళ పూర్తైతే హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, తిరుపతి, చెన్నై వైపు ఎక్కువ రైళ్లను నడిపే అవకాశముంటుంది.