ముఖ్యమంత్రి రేవంత్ కు ఎన్నికల్‌ కోడ్‌ వర్తించదా?

ముఖ్యమంత్రి రేవంత్ కు ఎన్నికల్‌ కోడ్‌ వర్తించదా?
 
ఒకవైపు పంచాయతీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా, మరోవైపు ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి అధికారిక కార్యక్రమాల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుండడంతో ముఖ్యమంత్రికి ఎన్నికల్‌ కోడ్‌ వర్తించదా? అన్న ప్రశ్న తలెత్తుతుంది.  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 3న సీఎంభారీ బహిరంగసభ నిర్వహించడంతోపాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో రూ.480 కోట్ల నిధులతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేయనున్నారని అధికారులు, స్థానిక నాయకులు ప్రకటించారు.
పేరుకు హుస్నాబాద్‌ మున్సిపాలిటీలో సీఎం సభా ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ అంతా గ్రామీణా ప్రాంతానికి చెందిన అభివృద్ధి పనులే కావడం గమనార్హం.
హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలో వివిధ గిరిజన తండాలను కలుపుతూ రూ.16.60 కోట్లతో నిర్మించే బీటీ రోడ్ల నిర్మాణానికి ఇదే సందర్భంగా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దీని ప్రభావం గిరిజన తండాలపై ఉంటుంది. ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనే అని ఆయా గ్రామాల ప్రజలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. 
 
కోహెడ మండలంలో రూ.200 కోట్లతో నిర్మించే యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణానికి, మహిళా సంఘాలకు బస్సుల పంపిణీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ, చిగురుమామిడి మండలం సుందరగిరి నుంచి కొత్తపల్లి వరకు రూ.77 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి, రూ.68.91 కోట్లతో హుస్నాబాద్‌ నుంచి అక్కన్నపేట మండల కేంద్రం వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి కూడా సీఎం శంకస్థాపన చేయనున్నారని స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదివారం ప్రకటించారు.

దీంతో చిగురుమామిడి, కోహెడ, అక్కన్నపేట మండలాల్లోని గ్రామీణ ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నది. సీఎం పర్యటనలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పంపిణీలు దాదాపు గ్రామీణ ప్రాంతాలవే అధికంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో మూడో విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లపై హుస్నాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఏకంగా సమీక్ష సైతం నిర్వహించారు.