శ్రీ భూమి కథ- నా అనుభవం

శ్రీ భూమి కథ- నా అనుభవం

ఆకారపు కేశవరాజు                                                                                                                       * జయ్ భీమ్ +జయ్ మీమ్ డ్రామా

అస్సాం పర్యటనలో గౌహతి చేరుకున్న నేను రెండు రోజుల కార్యక్రమాలు పూర్తిచేసుకుని ‘శ్రీభూమి’ గతంలోని, ప్రస్తుతపు పేరు ఆనాటి బెంగాల్ రాష్ట్రానికి సంపన్నమైన వ్యాపారానికి కేంద్రమైన జిల్లా కేంద్రం చేరుకున్నాను.  (మధ్యకాలంలో కరీంగంజ్ గా పిలవబడుతుండేది. ఇప్పటికీ  రైల్వేస్టేషన్ కు అదే పేరు.) సాయంత్రానికి శ్రీ భూమి చేరుకున్న నన్ను  ‘సమర్ ఘోష్’, బాధ్యత కలిగిన కార్యకర్త స్వాగతించి ఇంటికి తీసుకెళ్లారు. 

ఆయన గురించి వారి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే స్వాతంత్ర్య పోరాటంలో వారి కుటుంబ పెద్దలు పాల్గొని కొందరు వీరమరణం కూడా పొందారు.  దురదృష్టం కొద్దీ శ్రీ భూమి గా పేరెన్నిక గన్న ఈ భూభాగం, ప్రస్తుత బంగ్లాదేశ్ లోని సిల్హట్ జిల్లా అంతా పాకిస్థాన్ లో కలిపివేయడంతో తమ కుటుంబాల పాలిట మృత్యు శాపంగా మారిందనీ, పదుల సంఖ్యలో కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బాధను దిగమింగుతూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అప్పటి విషయాలను వివరించారు.

తమ పూర్వీకుల భూమి అటువైపు ఉంది అంటూ ఖుషీహర నది వరకు తీసుకెళ్లి చూపించాడు. ఈ ఊరికి కట్టుబట్టలతో పారిపోయి వచ్చామని, తమ వంటి కుటుంబాలు వందలాదిగా ఈ ఊర్లో ఉన్నారని కొన్ని కుటుంబాలతో కలిపించారు.  75, 80 సంవత్సరాలు వయస్సు వారు కొందరు కన్నీటి పర్యంతలవుతూ దేశ విభజన, తదుపరి బంగ్లాదేశ్ విభజన, ఆ తర్వాత కూడా మాటిమాటికి ఆక్రమణలు, హత్యలు, అరాచకాలు, ఆలయ విధ్వంసాలు జరిగిన క్రమం హృదయం ద్రవించిపోయేటట్టు చెబుతుంటే  “మనసు చలించిపోయింది – కర్తవ్యం బోధపడింది.”

‘సమర్ ఘోష్’జి చెప్పిన అసలు కథ: ప్రస్తుత బంగ్లాదేశ్ లోని సిల్హట్ 1947లో భారతదేశంలోనే భాగంగా ఉండేది. ఈ జిల్లాలో మెజారిటీ హిందువులే. అందులో అధిక సంఖ్యాకులు షెడ్యూల్ క్యాస్ట్ వర్గానికి సంబంధించిన వారే. వారికి నాయకత్వం వహించింది జోగేంద్రనాథ్ మండల్. ఆ తర్వాత రోజుల్లో పాకిస్తాన్ మొదటి న్యాయశాఖ మంత్రిగా కొంతకాలం పనిచేశారు.

ఆ ప్రాంతానికి ఏ భూభాగంలో ఉండాలో తేల్చుకోవడానికి ఎన్నికలు జరిగాయి. జోగేంద్ర నాథ్ మండల్.., ఏమన్నాడంటే `నేను జిన్నాతో మాట్లాడాను ఎస్సీలమైన మనకు న్యాయం జరుగుతుంది’ అంటూ భారత్ లోని అస్సాం రాష్ట్రపు భూభాగంలో కాకుండా పాకిస్థాన్ లో చేరుతాం అంటూ తీర్మానించుకుని, ఓటు వేసి చేరిపోయారు. (జయ్ భీమ్ +జయ్ మీమ్ డ్రామా.. అప్పటినుండే కొనసాగుతున్నది.)

సరిగ్గా మూడు సంవత్సరాల తర్వాత 1950వ సంవత్సరం పరిస్థితులు తలకిందులయ్యాయి. ఎవరైతే పాకిస్తాన్ లో చేరమని పిలిచారో అదే వర్గానికి చెందిన రాక్షసులు ‘సిల్హాట్’ లోని ప్రతి ఇంటికి వెళ్లి మహిళలపై అత్యాచారం చేశారు. మతం మారండి లేదా చచ్చిపోండి అంటూ చంపేశారు. వేలాదిమంది తనవాళ్లు హతమవగా దిక్కుతోచని పరిస్థితిలో జోగేంద్రనాథ్ మండల్ భారత్ కలకత్తాకు పారిపోయి వచ్చి రోడ్లపైన వేరుశెనక్కాయలు అమ్ముకొని జీవించాడు.

ఆనాటి రాజా జయచంద్ నుండి  జోగేంద్రమండల్ వరకు ఆక్రమణకారులకు వంత పాడుతూ తమ సమాజాన్ని నాశనం చేశారు. తాముకూడా భయంకరమైన కష్టాలు అనుభవించి నాశనమైపోయారు. తప్పుడు ఆలోచనలు కలిగిన వారిని సమర్థిస్తే తమను మాత్రమే కాదు తమ కుటుంబాన్ని, తమ సమాజాన్ని నాశనం చేస్తాయి. అమాయకులు నిర్దోషులు కష్టాలు అనుభవిస్తారు.

ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో గుర్తు చేశాను. ఆ రోజుల్లో ధ్వంసమైన ఆలయాలు రాధాకృష్ణ ఆలయం, దుర్గా మందిర్, హనుమాన్ మందిర్ వంటివి మళ్లీ నిర్మించుకున్న ఆలయాలను దర్శించుకుని అఖండభారతాన్ని గుర్తు చేసుకుంటూ, విడిపోయిన భాగాలను మన నుండి విడిపోయిన కుటుంబాలను మళ్లీ భారతమాత ఒడిలోకి తీసుకురావాలనే సంకల్పంతో తిరిగి వచ్చాను.