ఢిల్లీ ఉగ్ర పేలుడు వెనుక విస్తృతమైన వైద్యుల నెట్‌వర్క్‌

ఢిల్లీ ఉగ్ర పేలుడు వెనుక విస్తృతమైన వైద్యుల నెట్‌వర్క్‌
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు దర్యాప్తులో భద్రతా సంస్థలు ఉగ్రవాద మాడ్యూల్‌తో సంబంధం ఉన్న వైద్యుల విస్తృత నెట్‌వర్క్‌ను కనుగొన్నాయి. ఉన్నతస్థాయి వర్గాల సమాచారం ప్రకారం, అరెస్టు చేసిన వైద్యులు, ప్రధాన నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ ల కాల్ డిటైల్ రికార్డ్స్ (సిడిఆర్) అనేక మంది వైద్య నిపుణులతో విస్తృతమైన కమ్యూనికేషన్‌ను వెల్లడించింది.
 
ఏజెన్సీలు వైద్యుల సుదీర్ఘ జాబితాను రూపొందించాయని ఆ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. వీరిలో ఎక్కువ మంది అల్ ఫలా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు లేదా పనిచేశారు. జైష్-ఎ-మొహమ్మద్ (జెఎమ్)తో సంబంధం ఉన్న ఆరోపించిన ఆపరేటివ్ ఉమర్ పాల్గొన్న పేలుడు తర్వాత ఈ వ్యక్తులలో చాలామంది తమ మొబైల్ ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం.
 
ఉగ్రవాద నెట్‌వర్క్‌తో అనుమానిత సంబంధం కోసం ప్రస్తుతం డజను లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రొఫెషనల్ వైద్యులు స్కానింగ్‌లో ఉన్నారు. ముగ్గురు కీలక అనుమానితులు – డాక్టర్ షాహీన్, డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ ఆరిఫ్ (కాన్పూర్ లో అరెస్ట్) మధ్య విస్తృతమైన కమ్యూనికేషన్‌ను కనుగొన్నారు. నవంబర్ 1 నుండి నవంబర్ 7 మధ్య, డాక్టర్ ఆరిఫ్, డాక్టర్ షాహీన్ పరస్పరం 39 వాయిస్ కాల్స్, 43 వాట్సాప్ కాల్స్ , దాదాపు 200 టెక్స్ట్ సందేశాలు కనుగొన్నారు. 
 
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కార్‌ బాంబ్‌ పేలుడుపై ఎన్‌ఐఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో పోలీసులు పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన ఓ సర్జన్‌ను పోలీసులు అరెస్టు చేయగా, పశ్చిమ బెంగాల్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్‌కు చెందిన ఎంబీబీఎస్‌ విద్యార్థి జనిసూర్ అలియాస్ నిసార్ ఆలంను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. 
 
ఉగ్రవాద సంస్థలతో అతనికి సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో అరెస్టు చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. నిసార్ హర్యానాలోని అల్-ఫలా యూనివర్సిటీ విద్యార్థి కాగా, లూధియానాలో నివాసం ఉంటున్నాడు. అతని పూర్వీకుల ఇల్లు దల్ఖోలా సమీపంలోని కోనల్ గ్రామంలో ఉంది.  ఓ కార్యక్రమానికి వెళ్లివస్తుండగా సూరజ్‌పూర్‌ మార్కెట్‌లో నిసార్‌ను అరెస్టు చేశారు. 
 
అతని మొబైల్‌ లొకేషన్‌ డేటా ఆధారంగా అధికారులు అతని కదలికలపై నిఘా వేశారు. అతని నుంచి డిజిటల్‌ డివైజెస్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా పంజాబ్‌ పఠాన్‌కోట్‌కు చెందిన ఓ వైద్యున్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్‌ వర్గాలు తెలిపాయి. 45 ఏళ్ల సర్జన్ రెండు సంవత్సరాలకు పైగా పఠాన్‌కోట్‌లోని ఒక ప్రైవేట్ వైద్య కళాశాల-ఆసుపత్రిలో పనిచేస్తున్నారని వారు తెలిపారు.

గతంలో హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలోని అల్ ఫలా యూనివర్సిటీలో పని చేశారు. వైట్‌కాలర్‌ టెర్రర్‌ మాడ్యూల్‌ కేసులో ప్రధాన అనుమానితులతో డాక్టర్‌కు సంబంధాలున్నట్లుగా అనుమానిస్తున్నారు.

 
కాగా, ఎర్రకోట సమీపంలో పేలుడు నిందితుడు డాక్టర్‌ ఉమర్‌-ఉన్‌-నబీ అలియాస్‌ ఉమర్‌ మహ్మద్‌కు చెందిన పుల్వామాలోని అతని ఇంటిని భద్రతా బలగాలు బాంబులతో పేల్చేశాయి. ఇదే కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఉగ్రవాద మాడ్యూల్‌తో సంబంధం ఉన్న నలుగురు డాక్టర్లపై నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్ఎంసి) చర్యలు తీసుకున్నది. 
 
వారి రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. దేశంలో ఎక్కడా వైద్య వృత్తిని నిర్వహించకుండా ఎన్‌ఎంసీ నిషేధం విధించింది. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌లు నమోదవడం, జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి అందిన సమాచారం, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సమర్పించిన నివేదికలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నది.
డాక్టర్ ముజఫర్ అహ్మద్, డాక్టర్ అదీల్ అహ్మద్ రాదర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షాహీన్ సయీద్‌ల ఇండియన్ మెడికల్ రిజిస్ట్రీ (ఐఎంఆర్), నేషనల్ మెడికల్ రిజిస్ట్రీ (ఎంఎంఆర్) లోని రిజిస్ట్రేషన్‌ను వచ్చేలా రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇది వెంటనే అమలులోకి వస్తుందని తెలిపింది.