పార్టీ ఫిరాయించిన ఎమ్యెల్యే ముకుల్ రాయ్ పై అనర్హత వేటు

పార్టీ ఫిరాయించిన ఎమ్యెల్యే ముకుల్ రాయ్ పై అనర్హత వేటు
 
పార్టీ ఫిరాయింపుల విష‌యంలో క‌లక‌త్తా హైకోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది. ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన ముకుల్ రాయ్.. ఆ త‌ర్వాత తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ముకుల్ రాయ్ పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డ్డార‌ని బీజేపీ నేత‌లు క‌ల‌క‌త్తా హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.  బీజేపీ నేత‌లు దాఖ‌లు చేసిన అన‌ర్హత పిటిష‌న్‌పై కోర్టు విచార‌ణ జ‌రిపింది. ముకుల్ రాయ్‌ను ఎమ్మెల్యే ప‌ద‌వి నుంచి స‌స్పెండ్ చేస్తూ క‌ల‌క‌త్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
2021లో బిజెపి టికెట్‌పై గెలిచిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడం ద్వారా రాయ్ తన సభ్యత్వాన్ని కోల్పోయారని జస్టిస్ దేబాంగ్షు బసక్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.  గతంలో రాయ్‌ను అనర్హులుగా ప్రకటించడానికి లేదా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నుండి తొలగించడానికి నిరాకరించిన స్పీకర్ బిమన్ బెనర్జీ నిర్ణయాన్ని కూడా ధర్మాసనం రద్దు చేసింది. పీఏసీ చైర్మన్‌గా రాయ్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యే అంబికా రాయ్ 2021లో పిటిషన్ దాఖలు చేయడంతో వివాదం ప్రారంభమైంది. 
 
ఈ పదవి సాంప్రదాయకంగా ప్రతిపక్షానికి వెళుతుందని, తృణమూల్‌కు మారిన తర్వాత రాయ్‌ను బిజెపి ప్రతినిధిగా పరిగణించలేమని ఆయన వాదించారు. సాంకేతికంగా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ముకుల్ రాయ్ బహిరంగంగా తృణమూల్‌లో చేరార‌ని ఆరోపిస్తూ ప్రతిపక్ష నాయకులు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. 
 
2023లో సువేందు అధికారి మరొక పిటిషన్ దాఖలు చేస్తూ, ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ముకుల్ రాయ్ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని కోరారు. అన్ని వైపులా విన్న తర్వాత ఈ విషయాన్ని పునఃపరిశీలించాలని హైకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది. ఆ త‌ర్వాత కూడా ముకుల్ రాయ్‌ను అనర్హులుగా ప్రకటించడానికి ఎటువంటి ఆధారం లేదని స్పీకర్ వాదించారు. మొత్తానికి ముకుల్ రాయ్ స‌భ్య‌త్వాన్ని ఇవాళ క‌ల‌క‌త్తా హైకోర్టు ర‌ద్దు చేసింది.