ఉగ్రకుట్రకు అడ్డాగా అల్‌ ఫలాహ్‌లో 17వ నంబర్‌ భవనం

ఉగ్రకుట్రకు అడ్డాగా అల్‌ ఫలాహ్‌లో 17వ నంబర్‌ భవనం
 
* నాలుగు చోట్ల 32 వాహనాల్లో పేలుడు పదార్ధాలు నింపాలని యత్నం!
 
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో అల్‌ ఫలాహ్‌ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో దర్యాప్తు సంస్థల దృష్టి ఈ వర్సిటీపై పడింది. దర్యాప్తు అధికారులు వర్సిటీకి చేరుకొని ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో కీలక ఆధారాలు బయటపడినట్లు తెలుస్తోంది. మెడికల్‌ కాలేజీలోని బాయ్స్‌ హాస్టల్‌ ఉండే 17వ నంబర్‌ భవనం వీరి ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. 
 
ఈ భవనంలోని 13వ నంబర్‌ గది కీలకంగా మారింది. ముజమ్మిల్‌కి చెందిన ఈ గది వైట్‌ కాలర్‌ టెర్రర్‌ మాడ్యూల్‌ కు రహస్య సమావేశ కేంద్రంగా పనిచేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఢిల్లీ, సమీప రాష్ట్రాల్లో పేలుళ్లకు ఈ గది నుంచే కుట్ర చేసినట్లు తేలింది. యూనివర్సిటీ ల్యాబ్‌ నుంచి కొన్ని రసాయనాలను తీసుకురావాలని ఉమర్‌, ముజమ్మిల్‌ ప్లాన్‌ వేసినట్లుగా సమాచారం. 
 
ఈ గదిలో సోదాలు చేపట్టిన దర్యాప్తు అధికారులు కొన్ని కెమికల్స్‌తోపాటూ పెన్‌డ్రైవ్‌లు, పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ముజమ్మిల్‌ గదితో పాటు ఉమర్‌కు చెందిన 4వ నంబరు గది నుంచి మూడు డైరీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక విషయాలు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. డైరీల్లో భారీ ఉగ్ర ప్లాన్లను గుర్తించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.మొత్తం 32 వాహ‌నాల్లో పేలుడు ప‌దార్ధాల‌ను నింపాల‌ని అనుమానిత ఉగ్ర‌వాదులు ప్లాన్ చేసిన‌ట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. మొత్తం 8 మంది అనుమానితులు సుమారు నాలుగు లొకేష‌న్ల‌లో పేలుడుకు పాల్ప‌డాల‌ని భావించిన‌ట్లు తెలుస్తున్న‌ది.  ఈ డైరీలను పరిశీలించిన దర్యాప్తు అధికారులు దేశంలోని నాలుగు ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు వీరు ప్రణాళికలు చేసినట్లు గుర్తించారు. 

4 నగరాల్లో ఇద్దరు చొప్పున మొత్తం 8 మంది పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలిపారు. ఈ ఎనిమిది మందిలో ఉమర్‌, ముజమ్మిల్‌తో పాటు డాక్టర్‌ అదిల్‌, డాక్టర్‌ షాహీన్‌ కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ కుట్రను అమలుచేసే బాధ్యతను ప్రధానంగా ఉమర్‌కు అప్పగించినట్లు సమాచారం. ఇందుకోసం నిందితులు దాదాపు రూ. 26 లక్షల వరకు నిధులు సేకరించి ఆ మొత్తాన్ని ఉమర్‌కు ఇచ్చినట్లు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. 

ఇందులో రూ.3 లక్షల విలువైన 20 క్వింటాళ్లకుపైగా ఎన్​పీకే ఫెర్టిలైజర్‌ను గురుగ్రామ్‌, నూహ్‌ తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించాయి. ఈ పదార్థాలను వినియోగించి వారు ఐఈడీ బాంబులను తయారుచేయాలని ప్లాన్‌ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే, వీరి కుట్రలను పోలీసులు భగ్నం చేశారని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి.

అటు ఆ డైరీల్లో 25 మంది వ్యక్తుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా జమ్ముకశ్మీర్‌, ఫరీదాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. దీంతో పాటు నవంబరు 8 నుంచి 12 వరకు తేదీలను ప్రస్తావించినట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే వీరు దాడులకు పక్కా ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. సమాచార మార్పిడి కోసం సిగ్నల్ యాప్‌లో ఉమర్ నలుగురు సభ్యులతో గ్రూప్‌ సృష్టించారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. జైషే మహమ్మద్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాద మాడ్యూలే ఈ కుట్ర చేసినట్లు సమాచారం.

మరోవంక, నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడేషన్‌ కౌన్సిల్‌(న్యాక్) షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఆ విద్యాసంస్థ వెబ్‌సైట్‌లో గుర్తింపు గురించి తప్పుడు సమాచారం ప్రచురించినందుకుగానూ ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది.  ‘అల్‌-ఫలా వైద్య కళాశాల న్యాక్ గుర్తింపు పొందకుండానే వెబ్​సైట్​ కళాశాలో గుర్తింపు ఉందని బహిరంగా ప్రదర్శించింది. కనీసం అక్రిడేషన్ కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. ఇది పూర్తిగా తప్పు. ప్రజలను, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులను తప్పుదారి పట్టించడమే అవుతుంది’ అని నోటీసుల్లో పేర్కొంది. 

ఈ యూనివర్సిటీకి 2013లో న్యాక్​ ‘ఏ’ గ్రేడ్‌ అందుకుందని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. 2014లో రాష్ట్ర ప్రభుత్వం దీనికి యూనివర్సిటీ హోదా కల్పించింది. ఇదే యూనివర్సిటీకి అనుబంధంగా 2019లో అల్‌-ఫలా మెడికల్‌ కాలేజీని ఏర్పాటుచేశారు.