అమెరికాలో ముగిసిన షట్‌డౌన్‌

అమెరికాలో ముగిసిన షట్‌డౌన్‌

అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ కు తెరపడింది. అమెరికా చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగిన ప్రభుత్వ షట్‌డౌన్‌కు ముగింపు పలికేందుకు ప్రభుత్వ ఫండింగ్‌ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం రాత్రి సంతకం చేశారు. అంతకు ముందు రిపబ్లికన్‌ నేతృత్వంలోని ప్రతినిధుల సభలో 222-209 తేడాతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేశారు.

దీంతో 43 రోజుల పాటూ సుదీర్ఘంగా సాగిన ప్రభుత్వ షట్‌డౌన్‌కు ముగింపు పడినట్లైంది. మూడు రోజుల క్రితమే ఈ బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది.  సేనేట్‌లో రిప‌బ్లిక‌న్లు ప్రవేశ‌పెట్టిన ఫెడ‌ర‌ల్ నిధుల‌కు చెందిన బిల్లుకు ఆమోదం ద‌క్కకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ ప్రకటించింది. అమెరికా కాల‌మానం ప్రకారం సెప్టెంబర్‌ 30, అర్ధరాత్రి (11:59 నిమిషాలు) వ‌ర‌కు ఆ బిల్లు క్లియ‌రెన్స్ కోసం ఎదురుచూశారు.

కానీ డెమోక్రాట్లు త‌గ్గక‌పోవ‌డంతో  ట్రంప్‌ స‌ర్కారు ష‌ట్‌డౌన్ ప్రక‌టించింది. సేనేట్‌లో రిప‌బ్లిక‌న్లకు కంట్రోల్ ఉన్నా.. బిల్లును పాస్ చేయించుకోలేక‌పోయారు. ఫండింగ్ బిల్లు సేనేట్‌లో పాస్ కాక‌పోవ‌డం వ‌ల్ల నిర‌వ‌ధికంగా ప్రభుత్వ ష‌ట్‌డౌన్ ప్రక‌టిస్తున్నట్లు వైట్‌హౌజ్ పేర్కొన్నది. దాదాపు 43 రోజుల పాటూ షట్‌డౌన్‌ కొనసాగింది. అమెరికా చరిత్రలో అత్యధిక కాలం కొనసాగిన ‘షట్‌డౌన్‌’గా రికార్డు సృష్టించింది. ఈ షట్‌డౌన్‌ కారణంగా భారీగా నష్టం వాటిల్లింది. ఈ షట్‌డౌన్‌తో లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి.

ప్రభుత్వ షట్‌డౌన్‌ ప్రభావం ముఖ్యంగా విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. షట్‌డౌన్‌ సమయంలో ఎలాంటి జీతం లేకుండా పనిచేస్తున్న ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు, టీఎస్‌ఏ సిబ్బంది అనారోగ్య కారణాలతో విధులకు గైర్హాజరు కావడంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు ఆలస్యంగా అయ్యాయి. పరిమిత సంఖ్యలో ఉన్న ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌పై ఒత్తిడి తగ్గించడానికే ప్రభుత్వం విమాన సేవ‌ల్లో కోతను కూడా విధించింది.