ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తే స్వదేశంకు హసీనా సిద్ధం!

ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తే స్వదేశంకు హసీనా సిద్ధం!
బంగ్లాదేశ్‌ లో ఉద్రిక్తతల కారణంగా భారత్‌ కు వచ్చి ఆశ్రయం పొందుతున్న షేక్‌ హసీనా తిరిగి స్వదేశానికి వెళ్లే విషయంలో అక్కడి ప్రభుత్వానికి కొన్ని షరతులు పెట్టింది. అందరి భాగస్వామ్యం ఉండేలా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలనేది అందులో ప్రధానమైన షరతు. అదేవిధంగా బంగ్లాలో అవామీ లీగ్‌ పార్టీపై నిషేధం ఎత్తివేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను నిర్వహించినప్పుడే తాను తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తానని స్పష్టం చేశారు. అక్కడి ప్రజలు కూడా అటువంటి పరిస్థితులనే కోరుకుంటున్నారని చెప్పారు. ఓ వార్తాసంస్థకుఇచ్చిన ఈమెయిల్‌ ఇంటర్వ్యూలో హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు.  ప్రస్తుతం బంగ్లాలో అధికారంలో ఉన్న యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తీవ్రవాద శక్తులకు అధికారం ఇస్తూ, భారత్‌తో ఆ దేశ సంబంధాలను ప్రమాదంలో పడేస్తోందని ఆమె ఆరోపించారు.

తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో భారత్‌తో బలమైన సంబంధాలు కొనసాగించామని, యూనస్‌ తన మూర్ఖత్వంతో వాటిని బలహీనపరుస్తున్నారన్నారని హసీనా విమర్శించారు. కష్ట సమయంలో ఆశ్రయం కల్పించినందుకు మోదీ ప్రభుత్వానికి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.  తాను అధికారంలో ఉన్న సమయంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలను పరిష్కరించడంలో తమ ప్రభుత్వం విఫలమైందని, అలాంటి భయంకరమైన ఘటనల నుంచి పాఠాలు నేర్చుకున్నానని ఆమె చెప్పారు. ఆ సమయంలో విద్యార్థి నాయకులు కూడా బాధ్యత తీసుకొని ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. 

తనపై నమోదైన కేసుల విషయంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారణకు హాజరవడానికి తాను సిద్ధంగా ఉన్నానని షేక్‌ హసీనా తెలిపారు. యూనస్‌ ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను హసీనా ఖండించారు. అవన్నీ రాజకీయంగా తనను బలహీనపరచడానికి చేసిన కుట్రగా హసీనా ఆరోపించారు.  విద్యార్థుల ఆందోళనలతో అనూహ్యరీతిన ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్‌ హసీనా గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వచ్చారు. నాటి నుంచి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు.