భారత సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు

భారత సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు
భారత సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్  హెచ్చరించారు. సైనికులకు ఒకే మతం ఉందని, అదే సైన్య ధర్మమని అని పేర్కొంటూ దేశం సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా, సైనికులు ధైర్యం, శౌర్యం ప్రదర్శించి భారత్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని తెలిపారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భారత సైన్యం అగ్రవర్ణాల గుప్పిట్లో ఉందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు రాజ్ నాథ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

“దేశంలో రిజర్వేషన్ ఉండాలి. బీజేపీ కూడా రిజర్వేషన్లకు మద్దతు ఇస్తుంది. పేదలకు రిజర్వేషన్లు ఇచ్చాం. కానీ మన సైనిక సైనికులకు ఒకే మతం ఉంది. ఆ మతం సైన్య ధర్మం. ఇది తప్ప వేరే మతం లేదు. మన సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగకండి. కుల, మత రాజకీయాలు దేశానికి చాలా హాని కలిగించాయి” అని హితవు చెప్పారు.  “సమాజంలోని అన్ని వర్గాలను అండగా ఉండాలనేది మా ఆలోచన. కులం, తెగ లేదా మతం ఆధారంగా వివక్ష చూపడం మాకు ఇష్టం లేదు. మన దేశంలోని ఋషులు, ప్రజలు కులమతాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.” అని బీహార్ లోని బంకాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

సాయుధ దళాల్లో రిజర్వేషన్లు డిమాండ్ చేయడం ద్వారా దేశంలో అరాచకత్వాన్ని సృష్టించడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని రాజ్ నాథ్ మండిపడ్డారు. బిహార్‌ ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ ఇటీవల చెరువులో దూకి చేపలు పట్టడంపైనా రాజ్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకుడికి చెరువులోకి దూకడం తప్ప వేరే మార్గం లేదని ఎద్దేవా చేశారు. దేశాన్ని నడపడం పిల్లల ఆట కాదని ధ్వజమెత్తారు.

పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి కూడా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రస్తావిస్తూ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్లోని ప్రధాన ఉగ్రవాద స్థావరాలను తుదముట్టించామని గుర్తు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, కాస్త విరామం ఇచ్చామని చెప్పారు. “దేశంలోకి కొంతమంది ఉగ్రవాదులు వచ్చారు. కొందరు భారతీయులు తమ కుటుంబాలతో కలిసి కశ్మీర్లోని పహల్గాంకు వెళ్లారు. వారిని మతం అడిగి మరి ముష్కరులు చంపారు. ఆ తర్వాత ఏమి జరిగిందో వివరించాల్సిన అవసరం లేదు” అని తెలిపారు. 

“ఆపరేషన్ సిందూర్‌ చేపట్టి అన్ని ప్రధాన ఉగ్రవాద స్థావరాలను తుదముట్టించాం. భారత్ను ఇకపై ఎవరూ బలహీనమైన దేశంగా పిలవరు. ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా పిలుస్తున్నారు. అంతర్జాతీయంగా దేశ ఖ్యాతి పెరిగింది. భారత్ ఎవరినీ రెచ్చగొట్టదు. కానీ ఎవరైనా మమ్మల్ని రెచ్చగొడితే వారిని వదిలిపెట్టం. ఉగ్రవాదులు మళ్లీ భారత్పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే మేము తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటాం” అని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు.