ఛత్తీస్‌గఢ్‌లో మరో 51 మంది నక్సలైట్లు లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లో మరో 51 మంది నక్సలైట్లు లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం మరో 51 మంది నక్సలైట్లు బీజాపూర్ జిల్లా ఎస్‌పి జితేంద్ర కుమార్ యాదవ్ ఎదుట లొంగిపోయారు. వీరిలో 20 మందిపై సమిష్టిగా రూ 66 లక్షల వరకూ పారితోషికం అంతకు ముందు ప్రకటితం అయింది. స్థానిక అధికార యంత్రాంగం చేపట్టిన పునరావాస పథకంలో భాగంగా ఇప్పుడు ఇక్కడ నక్సలైట్లు లొంగిపోయారని పోలీసు అధికారులు తెలిపారు. 
 
లొంగిపోయిన వారిలో తొమ్మండుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. నక్సలైట్లు తమ పూర్వపు హింసా ప్రవృత్తిని వీడేందుకు, జనజీవన స్రవంతిలో కలిసేందుకు నిర్ణయించుకున్నారని, ఆయుధాలతో లొంగిపోయారని ఎస్‌పి వివరించారు. ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించారు.  లొంగిపోయిన వారిలో ఐదుగురు కీలకమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ)కు చెందిన వారు. ఏడుగురు ఏరియా కమిటీ సభ్యులు, ముగ్గురు స్థానిక నిర్వహక దళం వారు, ఒక్కరు మిలిషియా ప్లాటూన్ కమాండర్ , 14 మంది ప్లాటూన్ సభ్యులు, 20 మంది వరకూ దిగువ శ్రేణి వారు ఉన్నారని ఎస్‌పి చెప్పారు. 
మరోవైపు ఈనెల 26న లొంగిపోయిన కాంకేర్ జిల్లాకు చెందిన 21 మంది మావోయిస్టులను పోలీసులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారిలో కేశ్ కాల్ డివిజన్ కార్యదర్శి ముకేశ్ సహా 13 మంది మహిళా సభ్యులు, 8 మంది పురుషులు ఉన్నారని బస్తర్ ఐజి సుందర్ రాజ్ తెలిపారు. ఏకే -47, ఎల్ఎల్ఆర్, ఇన్సాస్‌సహా 18ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసినట్లు చెప్పారు. 
 
మావోయిస్టుల లొంగుబాటును స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంకా అడవుల్లో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలన్న బస్తర్‌ ఐజి, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.  2024 జనవరి నుంచి ఇప్పటివరకూ బీజాపూర్ జిల్లా నుంచి మొత్తం 650 మంది వరకూ లొంగిపోయారు. 196 మంది ఎన్‌కౌంటర్‌లలో హతులయ్యారు. ఇక దాదాపు వేయి మంది వరకూ అరెస్టు అయ్యారని పోలీసు వర్గాలు ఈ లొంగుబాటు నేపథ్యంలో తెలిపారు.