అర్ధరాత్రి తీరం దాటిన తుఫాన్‌ మొంథా బీభత్సం

అర్ధరాత్రి తీరం దాటిన తుఫాన్‌ మొంథా బీభత్సం
తీవ్ర తుఫాన్‌ మొంథా బీభత్సం సృష్టించింది! హోరుగాలులు, జోరు వానలతో వణికించింది! మంగళవారం అర్ధరాత్రి తర్వాత తీరం దాటింది. ఎపిని చిగురుటాకుల వణికించిన మొంథా తీవ్ర తుపాను మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 మధ్య తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రానున్న 6 గంటల్లో తుపానుగా బలహీన పడనుందని వెల్లడించింది. 
మచిలీపట్నం -కాకినాడ ప్రాంతానికి సమీపంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వద్ద తీరం దాటి భూ భాగంపైకి వచ్చింది. ప్రస్తుతం భూ భాగం మీద మొంథా తుపాన్‌ గమనం కొనసాగుతోందని భారత వాతవరణ శాఖ ప్రకటించింది. భూ భాగం మీదే మొంథా క్రమంగా బలహీనపడుతోందని తెలిపింది. ఇది ఉత్తర వాయవ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణంచి ఈ మధ్యాహ్నానికి చత్తీస్‌గఢ్‌ వద్ద మరింత బలహీన పడుతుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
 
మొంథా తుపాను తీరం దాటే సమయంలో గంటకు 12 కిలోమీటర్లు వేగంతో కదిలింది. ఇదే సమయంలో గంటకు 85 నుంచి 95, గరిష్టంగా 105 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తీరం దాటే ప్రక్రియ 3 నుంచి 4 గంటల పాటు కొనసాగింది. మొంథా దాదాపు 18 గంటలపాటు తీవ్ర తుపానుగా కొనసాగింది. మొంథా తీరం దాటినప్పటికీ గాలుల ప్రభావం కొనసాగుతోంది. గంటకు 85 నుంచి 95, గరిష్టంగా 105 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
 
దీని ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది తుపాను ప్రభావంతో గాలుల ఇంకా వీస్తున్నాయి. గంటకు 85 కి.మీ నుంచి 95 కి.మీ వేగంతో గాలుల ఉంటాయని తెలిపింది. మొంథా తుపాను నేపథ్యంలో వాల్తేరు రైల్వే డివిజన్‌ మార్గాల్లో నడిచే పలు రైళ్లను మూడు రోజులపాటు అధికారులు రద్దు చేశారు.
 
తీవ్ర తుఫాన్‌ కారణంగా మంగళవారం తీర ప్రాంతమంతా రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ప్రధానంగా ఏడు జిల్లాల్లో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వృక్షాలు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. తీవ్ర గాలుల తీవ్రతకు కరెంటు స్తంభాలు పడిపోవడంతో కృష్ణా జిల్లా తీర ప్రాంతమంతా అంధకారం అలుముకుంది. తుఫాన్‌ ప్రభావంతో కోస్తాలోని అనేక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి.
 
శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం, పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వస్తాయని హెచ్చరిక జారీచేశారు. కోస్తా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ మెసేజ్‌ జారీచేసింది.  మంగళవారం మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కమ్ముకొచ్చిన మేఘాలతో చీకట్లు అలుముకున్నాయి. వానకు గాలులు కూడా తోడయ్యాయి. 
 
తుఫాన్‌ ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాల్లో 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వీసిన గాలులతో తీరప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు. గాలులకు చాలాప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉండటంతో శ్రీకాకుళం జిల్లాపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం జిల్లా అంతటా వర్షం కురుస్తూనే ఉంది. 
 
ఒడిశా నుంచి వస్తున్న వరదతో మహేంద్రతనయ, బహుదా, వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహించాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి.  తుపాను ప్రభావంతో గడిచిన 12 గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 23 సెంటి మీటర్లు, ఉలవపాడులో 17 సెం.మీ, చీరాలలో 15 సెం.మీ వర్ష పాతం నమోదు అయింది. బుధవారం కోస్తాంధ్ర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. 
 
తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ‘మొంథా’ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కొత్తవలస-కిరండోల్‌ సింగిల్‌ రైల్వే ధ్వంసమైంది. అరకు రైల్వే టన్నెల్‌ నెంబర్‌ 32, చిమిడిపల్లి, బొర్రా గుహల మధ్య రైల్వే ట్రాక్‌ పూర్తిగా ధ్వంసమైంది. ట్రాక్‌పై మట్టి, బండరాళ్లు భారీగా చేరాయి. దీంతో ఆ ట్రాక్‌పై రాకపోకలు ప్రస్తుతానికి నిలిపివేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లోని 403 మండలాలపై మొంథా తుఫాన్‌ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగినట్టే చర్యలు తీసుకుంటున్నారు. మొంథా తుఫాన్‌ ప్రభావంతో తిరుమలలో మంగళవారం ఒకవైపు ఎడతెరిపిలేని వర్షం, మరోవైపు చలిగాలులతో భక్తులు అవస్థలు పడ్డారు. వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు ఈదురుగాలులతో వాన కురిసింది.