ఉమ్మడి ప్రదేశ్ లో, అవశేష ఆంధ్రప్రదేశ్ లో కౌలురైతులను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అత్యధిక శాతం మంది కౌలురైతులు భావిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం, పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ కలిసి నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది. కౌలురైతుల సమస్యలను ఏ రాజకీయపార్టీ పట్టించుకోవట్లేదని 92.1 శాతం మంది కౌలురైతులు తెలుపగా, పట్టించుకుంటున్నారని కేవలం 6.1, తెలియదని 1.9 శాతం మంది తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతుల సమస్యలపై 20 సెప్టెంబర్ నుండి 20 అక్టోబర్ వరకు ఒక నెలరోజులపాటు క్షేత్రస్థాయిలో 26 జిల్లాల్లో సర్వే నిర్వహించి దాదాపు 3000 శాంపిల్స్ సేకరించింది. ఒక్కొక్క జిల్లానుండి 100 నుండి 125 శాంపిల్స్ సేకరించడం జరిగింది. ఈ సర్వే ప్రకారం కౌలురైతుల్లో దాదాపు 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందినవారే ఉన్నట్లు వెల్లడైంది. కౌలురైతులకు గుర్తింపు కార్డు ఇచ్చిందా అని ప్రశ్నించినప్పుడు 87.7 శాతం మంది ఇవ్వలేదని కేవలం 12.3 శాతం మాత్రమే ఇచ్చిందని తెలిపారు.
2024 ఎన్నికల్లో కౌలు రైతులకు ఇస్తామన్న గుర్తింపు కార్డులు ఇవ్వకపొవారంతో వారు కూటమి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కౌలు రైతుల గుర్తింపునకు ప్రతిబంధకంగా తయారయిన పంట సాగుదారు హక్కు చట్టం (సిసిఆర్సి) స్థానంలో కొత్తగా చట్టం తెస్తామని కూటమి హామీ ఇచ్చినా ఇది అమలుకాకపోవడం లేదని సర్వేలో వెల్లడైంది.
కూటమి ప్రజాగళం పేరిట విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి అన్నీ సంక్షేమ పథకాలతో పాటు, పంటల భీమాను వర్తింపజేస్తామని హామీ ఇచ్చి 17 నెలలు కావొస్తున్నా ఇది కార్యరూపం దాల్చకపోవడంతో ఆగ్రహంతో ఉన్నారు. పైగా, అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే కౌలు రైతుల కోసం చట్టం తీసుకొస్తామని ప్రకటించినా ఈ చట్టాన్ని తీసుకురాలేదు.
కౌలురైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రశ్నిస్తే తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని 27.4 శాతం, గుర్తింపు కార్డు ఇవ్వాలని 22.7 శాతం, పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని 12.9 శాతం, పెట్టుబడికి రుణాలు మంజూరు చేయాలని 10.9 శాతం, రుణమాఫీ చేయాలని 10.5 శాతం మంది కోరారు.
వ్యవసాయం చేయడానికి పెట్టుబడి సంవత్సరానికి ఎంత అవసరమౌతోందని కౌలురైతులు ప్రశ్నించినప్పుడు రూ. 60 వేలకు పైన 34.3 శాతం, రూ. 40 వేల నుండి రూ. 60 వేల వరకు 23.8 శాతం, రూ. 25 వేల నుండి రూ. 45 వరకు 34.8 శాతం, రూ. 10 వేల నుండి రూ. 25 వేల వరకు 7.2 శాతం మంది కౌలురైతులు తెలిపారు.
వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడి సహాయానికి ఎవరిపైన ఆధారపడుతున్నారని ప్రశ్నించగా వడ్డీ వ్యాపారుస్థుల నుండి 38.1, రైస్ మిల్లర్లు, దళారులు, వ్యాపారస్థుల నుండి 28.8, కోఆపరేటివ్ బ్యాంకులు నుండి 13.5, భూయజమానుల నుండి 12.7, జాతీయ బ్యాంకుల నుండి 2.5 శాతం ఆర్థిక సహాయం పొందుతున్నామని కౌలురైతులు తెలిపారు.
ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకునే అప్పుకు ఎంత వడ్డీ చెల్లిస్తున్నారని ప్రశ్నించినప్పుడు అత్యధిక శాతం కౌలురైతులు 2 రూపాయలు చెల్లిస్తున్నామని 79 శాతం మంది తెలిపారు. రూపాయిన్నర చెల్లిస్తున్నామని 6.7 శాతం, ఒక రూపాయి చెల్లిస్తున్నామని 1.8 శాతం, 3 రూపాయలు చెల్లిస్తున్నామని 8.2 శాతం మంది తెలిపారు. ఎకరానికి ఎంత పెట్టుబడి పెడుతున్నారని కౌలురైతులను ప్రశ్నించగా రూ. 60 వేల పైన 26.5, రూ. 40 వేల నుండి రూ. 60 వేల వరకు 21.5 శాతం, రూ. 20 వేల నుండి రూ. 40 వేల వరకు 33.8 శాతం, రూ. 10 వేల నుండి రూ. 20 వేల వరకు 13.3 శాతం పెట్టుబడి పెడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.
ఒక పంట సాగుచేస్తే సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందని ప్రశ్నిస్తే రూ. 25 వేల పైన ఆదాయం వస్తోందని 28.1 శాతం, లాభం లేదు, నష్టం లేదని 19.4 శాతం మంది తెలుపగా, నష్టం వస్తోందని 15.4 శాతం మంది తెలిపారు. కూలీలకే దాదాపు 69.8 శాతం ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం మీకు ఎంత అప్పు ఉందని కౌలురైతులను ప్రశ్నించగా రూ. 5 లక్షల పైన 20.4 శాతం, రూ. 3 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు 14.5 శాతం , లక్షన్నర నుండి రూ. 3 లక్షల వరకు 34.6 శాతం, రూ. 50 వేల నుండి లక్షా 50 వేల వరకు 21.5 శాతం, రూ. 50 వేల కన్నా తక్కువ 9 శాతం మందికి అప్పు ఉన్నట్లు క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది.
కౌలురైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ధరలు, కూలీరేట్లు, యంత్రాల అద్దెలు పెరిగిపోవడమని 67.2 శాతం మంది తెలుపగా అధిక కౌలు వల్ల అని 12.5 శాతం, గిట్టుబాటు ధరలు రాకపోవడం వల్ల అని 10.8 శాతం, అధికవడ్డీలతో అప్పులు పెరిగిపోవడం అని 5.5 శాతం, మార్కెటింగ్ సమస్యల వల్ల అని 4 శాతం మంది చెప్పారు.
కౌలురైతులు ముఖ్యంగా ఎరువుల విషయంలో, పంట నష్టం వచ్చినప్పుడు భూయజమాని కౌలుతగ్గించకపోవడం, అకాలవర్షాలు, కరువు కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ప్రకటించే అరకొర సహాయం కూడా కౌలురైతులకు అందకపోవడం తదితర సమస్యలు ఎదుర్కొంటన్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది.
ఎకరానికి కౌలు ఎంత చెల్లిస్తున్నారని ప్రశ్నించినప్పుడు కొంతమంది నగదు రూపంలో చెప్పగా, కొంత మంది బస్తాలు (ధాన్యం) రూపంలో తెలిపారు. సంవత్సరానికి రూ. 35 వేల పైన భూయజమానులకు కౌలు చెల్లిస్తున్నామని 5.1శాతం, రూ. 25 వేల నుండి రూ. 35 వేలు అని 8.7 శాతం, రూ. 10 వేల నుండి రూ. 25 వేలు 27.3 శాతం, రూ.10 వేల కన్నా తక్కువ అని 22.4 శాతం మంది తెలిపారు.
సంవత్సరానికి ఎకరానికి 20 నుండి 30 బస్తాలు (ధాన్యం) భూయజమానులకు కౌలుకింద పంటలో భాగం ఇస్తున్నామని 13.2, 15 నుండి 20 బస్తాలు (ధాన్యం) 8.7, 10 నుండి 15 బస్తాలు (ధాన్యం) 14.5 శాతం మంది ఇస్తున్నామని వారు తెలిపారు. కౌలు ఒప్పందం మాట రూపంలోనే చేసుకుంటామని 92.3 తెలుపగా, రాతపూర్వకంగా ఒప్పందం చేసుకుంటామని 3.9, రెవెన్యూ రికార్డులో నమోదు ద్వారా 2.6 శాతం తెలిపారు.
10 ఎకరాలకు పైగా కౌలు తీసుకుంటున్న రైతులు 15.9 శాతం, 4 నుండి 10 ఎకరాలు 34.8 శాతం, 1 నుండి 3 ఎకరాలు 43.6 శాతం, ఒక ఎకరం కంటే తక్కువ 5.7 శాతం మంది భూయజమానుల నుండి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. 20 సంవత్సరాలకు పైగా కౌలుకు వ్యవసాయం చేస్తున్న రైతులు 35.5 శాతం ఉండగా, 11 నుండి 20 సంవత్సరాల వరకు 17.4 శాతం, 6 నుండి 10 సంవత్సరాలు 20 శాతం, 1 నుండి 5 సంవత్సరాల వరకు 27 శాతం మంది ఉన్నారు.
సామాజికంగా మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా అని ప్రశ్నించినప్పుడు, భూయజమానులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉచితంగా సర్వీస్ చేయవలసి వస్తుందని, బడుగుబలహీనవర్గాల వారి నుండి ఎక్కువ వడ్డీ వసూలు చేస్తూ తమ సామాజికవర్గానికి మాత్రం తక్కువ వడ్డీకే అప్పులు ఇస్తున్నట్లు కౌలురైతులు తెలిపారు. కౌలు రేట్ల విషయంలో కూడా ఇటువంటి వ్యత్యాసాలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.
ఒక్కరికే ప్రతి సంవత్సరం కౌలుకు ఇస్తే భూమి మీద కౌలురైతులకు హక్కులు వస్తాయనే ఆందోళనలో భూయజమానులకు ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. కౌలుకు ఇచ్చిన భూములపై భూయజమాని ముందుగానే పంటరుణాలు తీసుకుంటున్నారని, భూయజమానులు బ్యాంకుకు బకాయి ఉంటే వారి భూములు సాగుచేస్తున్న కౌలురైతులకు పంటరుణాలు ఇవ్వడం లేదని సర్వేలో తేలింది.
రాష్ట్రప్రభుత్వానికి కౌలు చట్టాన్ని తీసుకురావాలనే చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలు లేకపోయినా ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని తీసుకొని రావచ్చనే పలుచోట్ల కౌలురైతులు తెలిపారు. కౌలుదారులకు కొత్త చట్టం తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 5 సదస్సులు నిర్వహించి కౌలు రైతులు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సేవాసంస్థల నుండి అభిప్రాయాలు సేకరించారు.
ఈ సేకరించిన సమాచారాన్ని చెత్త బుట్టలో వేశారా? లేక పరిగణలోనికి తీసుకుంటారా? అనే విషయం పై స్పష్టత లేదని పలు చోట్ల రైతులు తెలిపారు. గుర్తింపు కార్డులు లేకపోవడంతో బ్యాంకులు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడం లేదు, దీంతో వడ్డీకి అప్పులు తీసుకోవాల్సి వస్తోంది, అప్పుల భారం పెరుగుతోంది. ఈ పంటలో నమోదు చేసుకోలేకపోవడంతో వరదలు, తుఫానుల వల్ల పంట నష్టపోయిన కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు అందడం లేదు, ఆర్థికంగా నష్టపోతున్నారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కౌలు రైతులు పంటలు అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. గుర్తింపు లేకపోవడంతో దళారులకు తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోంది. వర్షాభావం, తెగుళ్ల వల్ల దిగుబడి తగ్గుతోంది. కానీ కౌలు రైతులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందడం లేదు. చాలా మంది కౌలు రైతులు నోటి మాటతో ఒప్పందాలు చేసుకుని భూమిని తీసుకుంటారు. దీనివల్ల భూయజమానులతో వివాదాలు వచ్చినప్పుడు వారికి చట్టపరమైన రక్షణ లభించడం లేదు. ఫలితంగా సాగుచేయడానికి భూమిని, భూమిలో పెట్టిన పంటను కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు.
ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు చేయడం గురించి కౌలు రైతులకు తగిన శిక్షణ లేదా సాంకేతిక సమాచారం అందడం లేదు. దీంతో దిగుబడి తగ్గుతోంది. కౌలు రైతులు పంటల బీమా పథకాల్లో చేరలేకపోతున్నారు, ఎందుకంటే వారి వద్ద భూమి యాజమాన్య పత్రాలు లేవు. దీనివల్ల పంట నష్టపోయినప్పుడు వారికి ఎలాంటి భరోసా లేదు. రైతు భరోసా పథకం కౌలు రైతులకు సహాయం చేయడానికి ప్రవేశపెట్టబడినప్పటికీ, అర్హత పత్రాలు లేకపోవడం, అవగాహన లోపం వల్ల చాలా మందికి ఈ పథకం ప్రయోజనం అందడం లేదు.
భూ యజమాని తీసుకునే రుణంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డు కలిగిన ప్రతీ కౌలు రైతుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలను మంజూరు చేయాలని కౌలు రైతులు కోరుతున్నారు. కౌలు రక్షణ చట్టాన్ని ఆర్డినెన్స్ ద్వారా కూటమి ప్రభుత్వం వెంటనే తీసుకొచ్చి కౌలు రైతులకు భరోసా ఇవ్వాలని, అవసరమైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించైనా ఈ చట్టాన్ని తీసుకొనిరావాలని అత్యధిక శాతం మంది కౌలురైతులు కోరుతున్నారు.
More Stories
‘మెుంథా’ తుపానుతో 8 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు
విద్యార్థులే లేని 7,993 పాఠశాలల్లో 20,817 మంది ఉపాధ్యాయులు
ట్రినిడాడ్ అండ్ టొబాగోలో అయోధ్య తరహా రామ మందిరం