ఐఎన్‌ఎస్ విక్రాంత్ పేరు చెబితే పాక్‌కు నిద్రపట్టదు

ఐఎన్‌ఎస్ విక్రాంత్ పేరు చెబితే పాక్‌కు నిద్రపట్టదు
ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు వింటే శత్రువులకు (పాకిస్థాన్) నిద్రపట్టదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గోవా తీరంలోని ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై నౌకాదళ సిబ్బందితో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి పర్వదినాన్ని జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ దృశ్యం తన జీవితంలో ఎఫ్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.

తనకు ఒకవైపు మహాసముద్రం, మరోవైపు భారత సైన్యం నిల్చోవడం గర్వంగా అనిపిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. సముద్ర జలాలపై మెరుస్తున్న సూర్యకిరణాలు, సైనికుల చేత వెలిగిన దీపాల కాంతి వలె దివ్యంగా కనిపిస్తున్నాయని కొనియాడారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్ భారత సైనిక సామర్థ్యాలకు సాక్ష్యమని పేర్కొన్నారు. 

“ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం యుద్ధనౌక మాత్రమే కాదు. 21వ శతాబ్దపు భారతదేశపు కృషి, ప్రతిభ, నిబద్ధతకు నిదర్శనం. ఐఎన్ఎస్ విక్రాంత్ భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్, మేక్​ఇన్ ఇండియాకు సంకేతంగా నిలిచింది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ మన శత్రుదేశం పాకిస్థాన్​కు నిద్రలేని రాత్రులు మిగిల్చింది” అని ప్రధాని తెలిపారు. .

ఏప్రిల్ 22న పెహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా మే 7వ తేదీన భారత దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌లో భారత త్రివిధ దళాలు సమన్వయంగా పనిచేసి, పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని అనేక ఉగ్ర స్థావరాలను విజయవంతంగా దెబ్బతీశాయని మోదీ గుర్తుచేశారు. త్రివిధ దళాల సమన్వయం పాక్‌ను ఓటమి ఒప్పుకునేలా చేసిందని చెప్పారు.

మావోయిస్ట్ ఉగ్రవాదాన్ని నిర్మూలించడం ద్వారా దేశం ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించిందని ప్రధాని తెలిపారు.  “భారత్ మావోయిస్టు హింస నుంచి విముక్తి అంచున ఉంది. గతంలో, 125 జిల్లాలు మావోయిస్టు ఉగ్రవాదం గుప్పిట్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు కేవలం 11 జిల్లాల్లోనే మావోయిస్ట్ ఉగ్రవాదం ఉంది. సాయుధ దళాలు, పోలీసులు మావోయిస్టు హింసను పూర్తిగా నిర్మూలించడంలో విజయం సాధిస్తారని నాకు నమ్మకం ఉంది” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.


భారత్​ను ప్రపంచంలోని అగ్రశ్రేణి రక్షణ ఎగుమతిదారులలో ఒకటిగా మార్చడమే ఎన్​డీఏ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని మోదీ వెల్లడించారు. 2014 నుంచి భారత ఓడరేవుల్లో 40కి పైగా యుద్ధనౌకలు, జలాంతర్గాములను నిర్మితమయ్యాయని పేర్కొన్నారు. బ్రహ్మోస్ పేరు వింటే కొంతమంది మనసుల్లో (శత్రుదేశాలనుద్దేశించి) భయం నెలకొంటుందన్నారు. ఇప్పుడు చాలా దేశాలు బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.
అలాగే భారత సాయుధ దళాలను మోదీ తన కుటుంబంగా అభివర్ణించారు ప్రధాని మోదీ. “దీపావళిని ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని కోరుకుంటారు. నాకు కూడా దీపావళిని కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం అలవాటైంది. అందుకే నేను నా కుటుంబం అని భావించే మీ అందరి మధ్య( నేవీ సిబ్బందిని ఉద్దేశించి) దీపావళి జరుపుకోవడానికి వచ్చాను” అని చెప్పారు. 
 
“ఇక్కడ నా కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపాను. దీపావళి నాకు చాలా ప్రత్యేకం. ఐఎన్ఎస్ విక్రాంత్ డెక్‌ ల నుంచి దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.