ఆదాయం ఆగిపోయింది.. మళ్ళీ సినిమాల్లో నటిస్తా

ఆదాయం ఆగిపోయింది.. మళ్ళీ సినిమాల్లో నటిస్తా
 కేంద్ర పర్యాటక, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి, ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారి తీశాయి. రాజకీయాల్లోకి ప్రవేశించి కేంద్ర మంత్రిగా సేవలందిస్తున్న ఈ సీనియర్ నటుడు తన పదవిపై నేరుగా మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది. అలాగే రాజకీయాల్లోకి రావడంపై తనకు మొదటి నుంచీ ఆసక్తి లేదని సురేష్ గోపి గుర్తు చేసుకున్నారు. 
“నాకు రాజకీయాల కన్నా నటనంటే చాలా ఇష్టం. నేను మళ్లీ సినిమాల్లో నటించాలనుకుంటున్నాను. మంత్రిగా ఉన్న తర్వాత నా ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. నా జీవనోపాధి కోసం, కుటుంబ అవసరాల కోసం మళ్లీ సినిమాల్లోకి రావాల్సిన అవసరం ఉంది” అని సురేశ్ గోపి స్పష్టంగా చెప్పారు. 
సోమవారం కన్నూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సురేశ్ గోపి మాట్లాడుతూ“నేను మళ్లీ సినిమాల్లో నటించాలనుకుంటున్నాను. నాకు డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నా ఆదాయం పూర్తిగా ఆగిపోయింది” అని తెలిపారు.  ఎన్నికలకు ముందు రోజు కూడా తాను మంత్రి పదవి కోరుకోవడం లేదని, సినిమాల్లోనే కొనసాగాలని అనుకుంటున్నట్లు మీడియాకు చెప్పానని గుర్తుచేశారు.

తాను మంత్రిని కావాలని ఎప్పుడూ ప్రార్థించలేదని స్పష్టం చేశారు.  పార్టీలో తానే చిన్నవాడినని, తన స్థానంలో రాజ్యసభ ఎంపీ సి. సదానందన్ మాస్టర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన సూచించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు 200కిపైగా చిత్రాల్లో నటించిన సురేశ్‌ గోపి 2016లో బీజేపీలో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిస్సూర్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 

“ప్రజలు ఎన్నుకున్న మొదటి ఎంపీని కాబట్టి, పార్టీ నన్ను మంత్రిని చేయాలని భావించింది” అని ఆయన వివరించారు.ఈ సందర్భంగా, కొందరు తన మాటలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని సురేశ్ గోపి ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గమైన త్రిశూర్ ప్రజలను ఉద్దేశించి తాను ‘ప్రజ’ అనే పదాన్ని వాడటాన్ని కొందరు విమర్శించారని ఆయన గుర్తుచేశారు.

“ఒకప్పుడు పారిశుద్ధ్య కార్మికులను వేరే పేరుతో పిలిచేవారు, ఇప్పుడు వారిని ‘శానిటేషన్ ఇంజనీర్లు’ అంటున్నారు. అలాగే నేను ‘ప్రజ’, ‘ప్రజాతంత్రం’ వంటి పదాలు వాడితే తప్పేంటి?” అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యర్థులు తన మాటలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే కణ్ణూర్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత సదానందన్ మాస్టర్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు.