భారత్ తో సంబంధాలు వెంటనే సరిదిద్దండి

భారత్ తో సంబంధాలు వెంటనే సరిదిద్దండి
* ట్రంప్ కు 19 మంది డెమోక్రాటిక్ పార్టీ ఎంపీల లేఖ

భారత్‌తో దెబ్బతింటున్న కీలక భాగస్వామ్యాన్ని వెంటనే చక్కదిద్దాలని, సంబంధాలను పునరుద్ధరించాలని కోరుతూ 19 మంది అమెరికా చట్టసభ సభ్యులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు. భారత్‌ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం ఇటీవల 50 శాతం వరకు సుంకాలు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వీరంతా, ఈ చర్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
లేఖపై సంతకం చేసిన వారిలో డెబొరా రాస్, రో ఖన్నా, ప్రమీలా జయపాల్, రాజా కృష్ణమూర్తి వంటి ప్రముఖ డెమోక్రాటిక్ నేతలు ఉండగా, రిపబ్లికన్ పార్టీ నుంచి ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. “మీ పరిపాలనలో తీసుకుంటున్న చర్యల వల్ల, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌తో సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. ఇది రెండు దేశాలకూ ప్రతికూల పరిణామాలకు దారి తీస్తుంది. ఈ కీలక భాగస్వామ్యాన్ని సరిదిద్దడానికి మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి” అని వారు తమ లేఖలో స్పష్టం చేశారు. 
 
తామంతా పెద్ద సంఖ్యలో భారతీయ- అమెరికన్లు నివసించే జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని, వారికి భారత్‌తో బలమైన సాంస్కృతిక, ఆర్థిక బంధాలున్నాయని వారు గుర్తుచేశారు. పైగా, ట్రంప్ ప్రభుత్వం పెంచిన సుంకాల వల్ల అమెరికా వినియోగదారులపై ధరల భారం పడుతోందని, అమెరికన్ కంపెనీలు ఆధారపడే సరఫరా గొలుసులు దెబ్బతింటున్నాయని ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు.
 
సెమీకండక్టర్ల నుంచి ఆరోగ్య సంరక్షణ, ఇంధనం వరకు అనేక కీలక రంగాలలో అమెరికా తయారీదారులు భారత్‌పై ఆధారపడి ఉన్నారని వారు వివరించారు. ఈ సుంకాల పెంపు ఇరు దేశాల్లో లక్షలాది ఉద్యోగాలకు ముప్పు తెచ్చిపెడుతుందని వారు హెచ్చరించారు. అమెరికా అనుసరిస్తున్న కఠిన వైఖరి కారణంగా, భారత ప్రభుత్వం రష్యా, చైనాలతో దౌత్య, ఆర్థిక సంబంధాలను పెంచుకునేలా ఒత్తిడికి గురవుతోందని వారు హెచ్చరించారు. 
 
“ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేయడంలో భారత్ పాత్ర ఎంతో కీలకం. ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలిసి ‘క్వాడ్’ కూటమిలో అమెరికాకు భారత్ ఒక ముఖ్యమైన భాగస్వామి. ఇలాంటి సమయంలో మన చర్యలు భారత్‌ను దూరం చేసేలా ఉండకూడదు” అని వారు హితవు పలికారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలే తప్ప, ఘర్షణ వైఖరి తగదని వారు ట్రంప్‌కు వారు సూచించారు.