సెలబ్రిటీల రూ.కోట్ల విలువైన ఆస్తులను జప్తుకు సన్నాహాలు!

సెలబ్రిటీల రూ.కోట్ల విలువైన ఆస్తులను జప్తుకు సన్నాహాలు!

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలువురు క్రీడాకారులతో పాటు నటీనటులకు చెందిన రూ.కోట్ల విలువ చేసే ఆస్తులను జప్తు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫామ్ వన్‌ ఎక్స్‌బెట్‌కు సంబంధించిన కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేంద్ర ఏజెన్సీ ఈ చర్యలు తీసుకోబోతున్నది.  ఆ కంపెనీ నుంచి వచ్చిన డబ్బులను చాలామంది సెలబ్రిటీలు ఉపయోగిస్తున్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని ఈడీ అధికారులు పేర్కొన్నారు.

చట్టం ప్రకారం జప్తు చేయబడే ఆస్తుల్లో భారత్‌తో పాటు విదేశాల్లోనూ అనేక ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. ఎండార్స్‌మెంట్ ఫీజులను ఉపయోగించడాన్ని చట్టం దృష్టిలో ‘క్రిమినల్‌ ఇన్‌కం’ ఈడీ పరిగణిస్తోంది.   ఆన్‌లైన్ బెట్టింగ్ కంపెనీల నుంచి వచ్చిన ఎండార్స్‌మెంట్ ఫీజులను ఉపయోగించి అనేక మంది సెలబ్రిటీలు ఆస్తులను కొనుగోలు చేస్తున్నారని ఏజెన్సీ దర్యాప్తులో తేలింది.  ఈడీ నిఘాలో ఉన్న ఆస్తుల్లో భారత్‌తో పాటు విదేశాల్లో ముఖ్యంగా యూఏఈలో స్థిరచరాస్తులు ఉన్నాయి.

ప్రస్తుతం సెంట్రల్‌ ఏజెన్సీ ప్రస్తుతం ఆస్తులను పరిశీలిస్తుండగా త్వరలోనే తాత్కాలిక జప్తు కోసం ఉత్తర్వులు జారీ చేయనున్నారు.  అవసరమైన ఆమోదం కోసం ఈ ఆర్డర్ పీఎంఎల్‌ఏ అథారిటీకి పంపనున్నారు. ఆమోదం లభిస్తే ప్రత్యేక కోర్టులో ఈడీ చార్జిషీట్ దాఖలు చేయనున్నది. ఆయా ఆస్తులను శాశ్వతంగా జప్తు చేయనున్నారు. అయితే, గత కొద్దిరోజులుగా ఈడీ పలువురు ప్రముఖ క్రికెటర్లతో పాటు సినీ నటులను ప్రశ్నించిన విషయం తెలిసిందే. 

ఈడీ జాబితాలో మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రాబిన్ ఉతప్ప, శిఖర్ ధావన్, నటుడు సోను సూద్, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మిమి చక్రవర్తి, బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా పేర్లు సైతం ఉన్నారు. అదే సమయంలో పలువురు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు సైతం ఈడీ రాడార్‌లో ఉన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో వారిని కూడా ఈడీ ప్రశ్నించింది. 

పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద ఏజెన్సీ ప్రశ్నిస్తోంది. బ్యాంకు ఖాతాలు, లావాదేవీలకు సంబంధించిన పత్రాలను కూడా ఈడీ పరిశీలిస్తున్నది. ఈడీ ఆన్‌లైన్ బెట్టింగ్ కంపెనీని ఎలా సంప్రదించారు? ఏ ఛానెల్ ద్వారా (హవాలా/బ్యాంకింగ్) చెల్లింపు జరిగింది? భారతదేశంలో లేదా విదేశాల్లో చెల్లింపులు జరిగాయా? ఆర్థిక లావాదేవీ సమయంలో భారత్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ చట్టవిరుద్ధమని తెలుసా? అని ఈడీ ఆయా సెలబ్రెటిలను ప్రశ్నించింది. 

ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం ఉపయోగించే ప్లాట్‌ఫారమ్‌లు, కంపెనీల నుంచి పొందిన ఎండార్స్‌మెంట్ ఫీజుల ద్వారా సంపాదించిన ఏదైనా ఆస్తి నేరం మార్గంలో వచ్చిన ఆదాయమేనని ఈడీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏజెన్సీ ఆయా ఆస్తులను స్వాధీనం చేసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోనున్నది. బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా సైతం భారత్‌ వన్‌ ఎక్స్‌బెట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. 

ఈ కేసులో ఈడీ ఆమెకు సైతం సమన్లు జారీ చేసింది. ఊర్వశి విదేశీ పర్యటనలో ఉన్నందున ఈడీ విచారణకు హాజరు కాలేదు. అదే సమయంలో పలువురు ఆటగాళ్లతో పాటు నటీనటులు వాంగ్మూలం ఇవ్వలేదు. భారత్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ నియంత్రణలో ఉంది.  వన్‌ ఎక్స్‌బెట్‌ ద్వీప దేశమైన కురాకోలో నమోదైన కంపెనీ.  వెబ్‌సైట్, మొబైల్ యాప్ దాదాపు 70 భాషల్లో అందుబాటులో ఉంది. 

రూ.వేలకోట్ల విలువైన బెట్టింగ్ జరిగే ఈ ప్లాట్‌ఫారమ్‌పై ఇప్పటి వరకు ఈడీ నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ, ఇటీవల భారత ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధిస్తూ ఒక చట్టాన్ని చేసింది. ఓ అంచనా ప్రకారం నిషేధానికి ముందు భారతదేశంలో దాదాపు 22 కోట్ల మంది వినియోగదారులు వివిధ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు కనెక్ట్ అయ్యారు. ఇందులో సగం క్రమం తప్పకుండా యాక్టివ్‌గా ఉండేవారని సమాచారం.