
* ట్రంప్ వాణిజ్య భాగస్వామిగా `ఉగ్రవాదులకు స్వర్గధామం’ పాక్
`ఉగ్రవాదులకు స్వర్గధామం’గా పేరొందిన పాకిస్థాన్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఇప్పుడు `వాణిజ్య భాగస్వామి’గా మారడం, ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ లకు వైట్ హౌస్ లో ఆతిధ్యం ఇవ్వడం ఆసక్తి కలిగిస్తోంది. పైగా, వారిద్దరిని “గొప్ప నాయకులు” అంటూ కొనియాడారు. 2019 తర్వాత తొలిసారిగా ఓవల్ పర్యటనకు వచ్చిన పాకిస్థాన్ ప్రధానితో ట్రంప్ రహస్య చర్చలు జరిపారు.
అయితే, ట్రంప్తో సమావేశానికి ముందు షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ ఓవల్ కార్యాలయంలో ఒక గంట పాటు వేచి ఉండాల్సి వచ్చింది. షరీఫ్ సాయంత్రం 5 గంటలకు ముందే వెస్ట్ ఎగ్జిక్యూటివ్ అవెన్యూ ప్రవేశద్వారం వద్దకు చేరుకున్నారు. అక్కడ సీనియర్ పరిపాలన అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయనతో పాటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కూడా ఉన్నారు. పత్రికలకు అనుమతి లేని ఈ ఓవల్ ఆఫీస్ భేటీ అమెరికా అధ్యక్షుడితో షరీఫ్ మొదటి సమావేశం.
అంతేకాకుండా, జూలై 2019లో ఇమ్రాన్ ఖాన్ పర్యటన తర్వాత ఏ ప్రధానమంత్రి కూడా ఓవల్ కార్యాలయంలోకి ప్రవేశించకపోవడంతో పాకిస్తాన్కు ఇది చారిత్రాత్మకం. గాజాలో ఇజ్రాయెల్- హమాస్ యుద్ధాన్ని ముగించే వ్యూహాన్ని చర్చించడానికి ఈ వారం ఐరాస జనరల్ అసెంబ్లీ సందర్భంగా ట్రంప్తో సమావేశమైన ఎనిమిది అరబ్ లేదా ముస్లిం దేశాల ఉన్నతాధికారులలో షరీఫ్ కూడా ఉన్నారు. ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, భారతదేశంపై పదునైన వ్యాఖ్యలకు పేరుగాంచిన మునీర్ను ప్రశంసిస్తూ ట్రంప్ ఒక అడుగు ముందుకు వేశారు.
“మనకు గొప్ప నాయకుడు వస్తున్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఫీల్డ్ మార్షల్. ఫీల్డ్ మార్షల్ చాలా గొప్ప వ్యక్తి. ప్రధాన మంత్రి కూడా అంతే. వారు వస్తున్నారు. వారు ప్రస్తుతం ఈ గదిలో ఉండవచ్చు” అని ఆయన పేర్కొన్నారు. గత జులైలో జరిగిన అమెరికా -పాకిస్తాన్ వాణిజ్య ఒప్పందాన్ని అనుసరించి ఈ భేటీ జరిగింది. ఈ ఒప్పందంతో వాషింగ్టన్ పాకిస్తాన్ పెద్దగా ఉపయోగించని చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి, ఇస్లామాబాద్కు సుంకాలను తగ్గించడానికి సహాయం చేస్తుందని భావిస్తున్నారు.
అంతకు ముందు న్యూయార్క్లో జరిగిన ఐరాస జనరల్ అసెంబ్లీ సందర్భంగా ఇద్దరు నాయకులు క్లుప్తంగా మాట్లాడిన కొన్ని రోజుల తర్వాత ఈ భేటీ జరిగింది. ట్రంప్ గతంలో పాకిస్తాన్ను “ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామం”గా అభివర్ణించారు. ఇది వాషింగ్టన్ను తప్పుదారి పట్టించిందని మండిపడ్డారు. అయితే, పాకిస్తాన్ ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన తర్వాత జనరల్ అసిమ్ మునీర్ ఇటీవలి నెలల్లో రెండుసార్లు అమెరికాకు వెళ్లారు. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉద్రిక్తతలను తగ్గించడంలో ట్రంప్ తన పాత్రను పదే పదే చెప్పుకుంటున్నారు.
అయితే, ఈ ఆపరేషన్లో ఏ విదేశీ శక్తి ప్రమేయం లేదని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేస్తున్నారు. ఉగ్రవాద నిరోధక, వాణిజ్యంపై వాషింగ్టన్ ఇస్లామాబాద్తో కలిసి పనిచేస్తోందని విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. “పాకిస్తాన్, వారి ప్రభుత్వ నాయకులతో చర్చలు జరపడం ద్వారా ఈ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంపై అధ్యక్షుడు దృష్టి సారించారు” అని ఆ అధికారి రాయిటర్స్తో పేర్కొన్నారు.
More Stories
మదర్సా మరుగుదొడ్లలో 40 మంది బాలికల నిర్బంధం
కెనడా ఖలిస్థానీ ఉగ్రవాది అజిత్ దోవల్కు బెదిరింపులు
రాజస్థాన్ ఎడారికి సింధూ జలాలు తరలించే మెగా ప్రాజెక్ట్