కెనడా ఖలిస్థానీ ఉగ్రవాది అజిత్‌ దోవల్‌కు బెదిరింపులు

కెనడా ఖలిస్థానీ ఉగ్రవాది అజిత్‌ దోవల్‌కు బెదిరింపులు

ఖలిస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్‌ కెనడాలో మూడు రోజుల క్రితం అరెస్టైన విషయం తెలిసిందే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం సహా పలు అభియోగాలపై గోసల్‌ను ఒట్టావాలో అదుపులోకి తీసుకున్నారు. అయితే, అరెస్టైన నాలుగు రోజుల్లోనే అతడు విడుదలయ్యాడు. బెయిల్‌పై ఒంటారియో సెంట్రల్‌ ఈస్ట్‌ కరెక్షనల్‌ సెంటర్‌ నుంచి బయటకు వచ్చాడు. 

జైలు నుంచి బయటకు వచ్చిన గోసల్‌ తాను ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నానని వ్యాఖ్యానించాడు. ఖలిస్థాన్‌ కోసం పన్నూన్‌ చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇస్తానని ప్రకటించాడు. ‘ఢిల్లీ బనేగా ఖలిస్తాన్’ అంటూ మీడియాతో అన్నాడు. గోసల్ విడుదలైన అనంతరం సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్ జె ఎఫ్) అనే వేర్పాటువాద సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైన గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌  జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ ను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డాడు. 

‘అజిత్‌ దోవల్‌.. మీరు కెనడా, అమెరికా లేదా ఏదైనా యూరోపియన్‌ దేశానికి ఎందుకు రావట్లేదు? వచ్చి నన్ను అరెస్ట్‌ చేయడానికి, లేదా అదుపులోకి తీసుకోడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? మీ రాకోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఇంద్రజీత్ సింగ్ గోసల్‌ గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌కు అత్యంత సన్నిహితుడు. 2023 నుంచి గోసల్‌ కెనడాలో ఎస్‌ఎఫ్‌జే కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. గత ఏడాది నవంబర్‌లోనూ కెనడా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. గ్రేటర్ టొరంటో ఏరియాలోని ఒక హిందూ ఆలయం వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో ప్రమేయం ఉందని ఆ సమయంలో ఆరోపణలు వచ్చాయి. తర్వాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో బయటికి వచ్చాడు.