అయోధ్యలో మసీదు నిర్మాణానికి బ్రేక్

అయోధ్యలో మసీదు నిర్మాణానికి బ్రేక్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య లో 500 ఏళ్ల నాటి కలను నెరవేర్చుతూ 2019లో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. అప్పటివరకు శతాబ్దాలుగా వివాదాస్పద ప్రాంతంగా ఉన్న చోట రామమందిర నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తూ తీర్పును ఇవ్వగా, ఆ తర్వాత చకచకా పనులు జరిగి 2024 జనవరి 22వ తేదీన రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ మహా ఘట్టాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అంగరంగ వైభవంగా నిర్వహించింది. 
 
అయితే తీర్పు సమయంలో అయోధ్యలో మసీదు నిర్మాణానికి భూమిని కేటాయించాలని ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. కానీ మసీదు నిర్మాణం మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఈ క్రమంలోనే యూపీలోని ధన్నిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణం కోసం సమర్పించిన ప్లాన్‌ను అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ (ఏడీఏ) తిరస్కరించింది. 
 
అయితే రాష్ట్ర ప్రభుత్వంలోని పలు శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (నిరభ్యంతర పత్రం) సమర్పించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ వెల్లడించింది. 2019లో అయోధ్యకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుకు అనుగుణంగా మసీదు నిర్మాణానికి కేటాయించిన భూమిని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అప్పగించింది. 
సమాచార హక్కు చట్టం కింద జర్నలిస్ట్ ఓం ప్రకాష్ సింగ్ అడిగిన ప్రశ్నకు అయోధ్య డెవలప్‌మెంట్‌ అథారిటీ ఈనెల 16వ తేదీన సమాధానం ఇచ్చింది. 2021 జూన్ 23వ తేదీన నిర్మాణ ప్లాన్‌కు సంబంధించి మసీదు ట్రస్ట్ దరఖాస్తు పెట్టుకున్నట్లు వివరించింది. అయితే వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు లేకపోవడంతో దాన్ని తిరస్కరించినట్లు వెల్లడించింది. యూపీ ప్రజా పనుల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సివిల్ ఏవియేషన్, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, ఫైర్ సర్వీస్‌ల నుంచి మసీదు ట్రస్ట్ అనుమతులు పొందలేదని పేర్కొంది.
 
అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నిపూర్ గ్రామం సోహవల్ తహసిల్‌లో 5 ఎకరాల భూమిని సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డుకు అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ అంజు కుమార్ ఝా అందించారు. అప్లికేషన్, సెక్యూరిటీ ఫీజు కింద మసీదు కమిటీ రూ.4,02,628 చెల్లించినట్లు.. అయితే డిపార్ట్‌మెంటల్ ఆమోదం లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు ఆర్టీఐ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ తెలిపింది.