
ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన లోక్సత్తా పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వేటు వేసింది. తెలంగాణలో ఆ పార్టీ రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా లేని, నిబంధనలు పాటించని గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై ఈసీ చేపట్టిన ప్రక్షాళనలో భాగంగా ఈ చర్య తీసుకుంది.
కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా దేశవ్యాప్తంగా 474 పార్టీల రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది. వీటిలో ఏపీకి చెందిన 17 పార్టీలు, తెలంగాణకు చెందిన 8 పార్టీలు ఉన్నాయి. గత ఆరేళ్లుగా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడం, పార్టీ కార్యాలయ చిరునామా, ఆర్థిక లావాదేవీల వివరాలు సమర్పించకపోవడం వంటి కారణాలతో ఈసీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో రద్దయిన పార్టీల జాబితాలో లోక్సత్తాతో పాటు ఆలిండియా ఆజాద్ పార్టీ, బీసీ భారతదేశం పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ వంటివి ఉన్నాయి.
రాజకీయాల్లో సంస్కరణలు తీసుకురావాలనే లక్ష్యంతో జేపీ 2006లో లోక్సత్తా పార్టీని స్థాపించారు. 2009లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే, 2014 తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న జేపీ, ప్రస్తుతం కేవలం చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల సంఘం ఈ ప్రక్షాళన ప్రక్రియను గత కొంతకాలంగా కొనసాగిస్తోంది.
గత ఆగస్టు నెలలో కూడా 334 పార్టీలను ఇదే విధంగా జాబితా నుంచి తొలగించింది. దీంతో కేవలం రెండు నెలల వ్యవధిలోనే మొత్తం 808 పార్టీల రిజిస్ట్రేషన్ను రద్దు చేసినట్లయింది. త్వరలోనే మరో 359 పార్టీలను కూడా తొలగించనున్నట్లు ఈసీ సంకేతాలిచ్చింది. వాటిలో ఏపీకి చెందిన 8, తెలంగాణకు చెందిన 10 పార్టీలు ఉండనున్నాయి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణ నుంచి తొలగించిన పార్టీలు: ఆలిండియా ఆజాద్ పార్టీ, ఆలిండియా బీసీ ఓబీసీ పార్టీ, బీసీ భారతదేశం పార్టీ, భారత్ లేబర్ ప్రజాపార్టీ, లోక్సత్తా పార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి.
ఏపీ నుంచి ఈసీ రద్దు చేసిన పార్టీలు: భారతీయ చైతన్య పార్టీ, జై సమైక్యాంధ్ర పార్టీ, రాయలసీమ పరిరక్షణ సమితి, ఆలిండియా లిబరల్ పార్టీ, భారత్ ప్రజా స్పందన పార్టీ, ఆలిండియా మంచి పార్టీ, భారతీయ సధర్మ సంస్థాపన పార్టీ, వెనుకబడిన వర్గాల మహిళా రైతు పార్టీ, వైఎస్ఆర్ బహుజన పార్టీ, గ్రేట్ ఇండియా పార్టీ, జై ఆంధ్రా పార్టీ, పేదరిక నిర్మూలన పార్టీ, పేదల పార్టీ, ప్రజాపాలన పార్టీ, సమైక్య తెలుగురాజ్యం పార్టీ, రాయలసీమ కాంగ్రెస్పార్టీ, పొలిటికల్ ఎసెన్షియల్ అండ్ యాక్యురేట్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ పార్టీలు ఉన్నాయి.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు