టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌల‌ర్‌గా అర్షదీప్

టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌల‌ర్‌గా అర్షదీప్
 
ఆసియా క‌ప్‌లో భాగంగా ఒమన్‌తో జ‌రిగిన చివ‌రి గ్రూప్ ద‌శ మ్యాచ్‌లో భార‌త ఫాస్ట్ బౌల‌ర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఒక వికెట్‌ను ప‌డ‌గొట్టి అంత‌ర్జాతీయ టీ20లో వంద వికెట్ల తీసిన భార‌తీయ బౌల‌ర్‌గా ఘ‌న‌త సాధించాడు. అబుదాబిలో శుక్ర‌వారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 188 పరుగులు చేసింది. 
 
ఆ త‌ర్వాత ఒమ‌న్ జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 167 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. అయితే, ఆమిర్ కలీమ్, హమ్మద్ మీర్జా 93 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పి టీమిండియా బౌల‌ర్ల‌ను ధీటుగా ఎదుర్కొన్నారు. కానీ, ఈ ఇద్ద‌రు జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చ‌లేక‌పోయారు.  ఇక టీ20లో అంత‌ర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన బౌల‌ర్‌గా అర్ష్‌దీప్ నిలిచాడు. 
 
అంతర్జాతీయ టీ20లో వంద వికెట్లు తీసిన ఈ ఫాస్ట్ బౌలర్ కేవలం 64 మ్యాచ్‌ల్లోనే ఈ మైల్‌స్టోన్‌ను చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే మూడో బౌల‌ర్‌గా నిలిచాడు. అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన రికార్డు ఆప్ఘ‌నిస్తాన్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ పేరిట ఉన్న‌ది. కేవ‌లం 53 మ్యాచుల్లోనే ఈ మైలురాయిని చేరాడు. 
 
ఆ త‌ర్వాత శ్రీలంకకు చెందిన వానిందు హసరంగా 63 మ్యాచ్‌ల్లో 100 వికెట్లు సాధించాడు. అర్ష్‌దీప్ తర్వాత.. పాకిస్తాన్‌కు చెందిన హారిస్ రౌఫ్ (71 మ్యాచ్‌లు), ఐర్లాండ్‌కు చెందిన మార్క్ అడైర్ (72 మ్యాచ్‌లు) ఈ జాబితాలో ఉన్నారు. ఒమ‌న్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి స్థానంలో హర్షిత్ రాణా, జ‌స్‌ప్రీత్ బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ జ‌ట్టులోకి వ‌చ్చారు. 
 
ఈ మ్యాచ్‌లో ఇద్దరూ చెరో వికెట్ తీశారు. ఇది భారత జట్టుకు 250వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్. టైటిల్‌ను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ టోర్నమెంట్‌లోకి అడుగుపెట్టిన భారత్‌కు ఆరంభం బ‌లంగానే ల‌భించింది. తొలి మ్యాచ్‌లో యూఏఈని తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి సూపర్ ఫోర్ దశకు చేరుకుంది.