టిటిడిపై మరో వివాదంలో మాజీ చైర్మన్ భూమన

టిటిడిపై మరో వివాదంలో మాజీ చైర్మన్ భూమన
టీటీడీపై వైసీపీ నేత, ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు గుప్పించి చిక్కుల్లో పడినట్లు కనిపిస్తున్నది. తిరుపతిలోని అలిపిరి పాత చెక్‌పోస్టు సమీపంలో పాడైపోవడంతో పక్కన పడేసిన ఓ విగ్రహం పేరిట దుష్ప్రచారానికి తెరతీశారు. మంగళవారం ఉదయం ఆయన ఆ విగ్రహాన్ని వీడియో తీసి ‘శ్రీ మహావిష్ణువు విగ్రహానికి ఘోర అపచారం జరిగింది’ అని ఆరోపిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. 

టీటీడీపై భూమన ఉద్దేశపూరకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలిపిరి పాదాల చెంత ఉన్నది శ్రీమహావిష్ణువు విగ్రహం కాదు.. శనీశ్వరుడి విగ్రహమని స్పష్టం చేశారు. దీనిపై మధ్యాహ్నం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో బోర్డు తీవ్రంగా స్పందించింది. టీటీడీపై తప్పుడు ప్రచారాలు చేసేవారిపై క్రిమినల్‌ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, సభ్యులు హెచ్చరించారు.

కాగా, టీటీడీపై దుష్ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ టీటీడీ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ గోవిందరాజులు చేసిన ఫిర్యాదు మేరకు భూమనపై అలిపిరి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ సమాచారంతో భూమన మరో వీడియో విడుదల చేశారు. శనైశ్చరుడి విగ్రహానికి శంఖు చక్రాలు ఎందుకుంటాయని, దాన్ని ఎవరో తెచ్చి పడేస్తే తీసివేయాల్సిన బాధ్యత టీటీడీకి లేదా అని ప్రశ్నించారు.

కాగా, భూమన ఆరోపణలను ఏపీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం తీవ్రంగా ఖండించింది. అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై చట్ట పరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. కాగా, అలిపిరిలోని విగ్రహంపై స్థపతి కన్నయ్య చారి కుమారుడు గురుస్వామి స్పష్టత ఇచ్చారు. దాదాపు 22 ఏళ్ల క్రితం తమకు రాయలచెరువు రోడ్డులో విగ్రహాల తయారీ షెడ్డు ఉండేదని చెప్పారు.

అప్పట్లో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తమకు శనైశ్చరుడి విగ్రహం కోసం ఆర్డర్‌ ఇచ్చారని తెలిపారు. తర్వాత అతను చనిపోయాడని వెల్లడించాడు. తమ పరిస్థితి బాలేకపోవడంతో అలిపిరిలోని శిల్పా క్వార్టర్స్‌కు వెళ్లామని తెలిపారు. 2003లో అలిపిరిలో బాంబు పేలుడు నేపథ్యంలో తమను అక్కడినుంచి ఖాళీ చేయించారని, ఆ సమయంలో చిన్న విగ్రహాలు తీసుకొని, భారీ శనైశ్చరుడి విగ్రహాన్ని అక్కడే వదిలేశామని వివరించారు. 22 ఏళ్లుగా ఈ విగ్రహం అక్కడే ఉందని గురుస్వామి వివరించారు.