రష్యా పౌరులకు ఏడాది పాటు చైనాలో వీసా ఫ్రీ ప్రవేశం

రష్యా పౌరులకు ఏడాది పాటు చైనాలో వీసా ఫ్రీ ప్రవేశం

అమెరికా మినహా ఇతర అగ్రదేశాలు తమ బంధాన్ని బలపరుచుకుంటున్నాయి. ముఖ్యంగా రష్యా, చైనా దేశాలు ఈ క్రమంలో మరింత చేరువ అవుతున్నాయి. ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న టారిఫ్‌ నిర్ణయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇతర దేశాలు ఒక్కటవుతూ కొత్త మైత్రి సంబంధాలను కుదుర్చుకుంటున్నాయి. చైనా తాజాగా రష్యాకు ప్రత్యేక ఆఫర్‌ ఇచ్చింది. రష్యా పౌరులకు ఏడాది పాటు వీసా లేకుండా తమ దేశంలో ప్రవేశించేందుకు చైనా అనుమతించింది.

ఈ విధానం సెప్టెంబర్‌ 15, 2025 నుంచి అమల్లోకి వచ్చింది వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 14, 2026 వరకు ఇది కొనసాగుతుంది. రష్యా నుంచి బిజినెస్‌ లేదా పర్యాటక ప్రయాణాలకు వచ్చే వారికి ఇది వరం లాంటిది.  సాధారణ పాస్‌పోర్ట్‌ ఉంటే ఎటువంటి వీసా అవసరం లేకుండా చైనాలో ప్రవేశించవచ్చు.  చైనా ఈ పాలసీ ద్వారా టూరిజం రంగాన్ని అభివృద్ధి చేయాలని చూస్తోంది. రష్యా నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని అంచనా.ఈ ఏడాది రష్యన్ల టూరిజం 45 శాతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. 

అందుకు తగ్గట్టుగా కొత్త విమాన సర్వీసులను కూడా ప్రారంభిస్తున్నారు. రష్యా ప్రజలకు స్నేహితులు, బంధువులను కలిసే సౌకర్యం కూడా పెరుగుతోంది. వీసా ఫ్రీ పాలసీ కింద ఇప్పటికే మొదటి బ్యాచ్‌ వచ్చింది. దాదాపు 300 మంది రష్యన్లు చైనాలో అడుగుపెట్టారు. ఈ ఏడాది కొన్ని లక్షల మంది రష్యన్లు చైనాలో పర్యటించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. 

ఇది కేవలం టూరిజం మాత్రమే కాదు, వాణిజ్య రంగానికీ లాభదాయకం. ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు మరింత బలపడతాయని నిపుణులు చెబుతున్నారు. రష్యా ఒకవైపు అమెరికాకు దూరమవుతోంది. టారిఫ్‌ల ప్రభావం కారణంగా కొత్త మిత్రులను వెతుకుతోంది. అదే సమయంలో చైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. డ్రాగన్‌ కంట్రీ తనను సూపర్‌ పవర్‌గా నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంది. భారత్‌తో సహా పలు దేశాలతో సంబంధాలను బలపరుస్తోంది. 

 
అమెరికా ఒంటెత్తు పోకడలకి ప్రత్యామ్నాయం సృష్టించాలన్నది దీని వ్యూహం. రష్యా-చైనా బంధం కేవలం రాజకీయమే కాదు, ఆర్థికంగా కూడా ప్రభావం చూపనుంది. వీసా ఫ్రీ పాలసీ ద్వారా టూరిజం విస్తరించనుంది. వాణిజ్యానికి కొత్త అవకాశాలు దక్కనున్నాయి. అమెరికా టారిఫ్‌ నిర్ణయాలు అనుకోకుండా ఈ రెండు దేశాల మధ్య మైత్రి బంధాన్ని మరింత బలపరిచాయి. ప్రపంచ శక్తి సమీకరణాల్లో ఇది కీలక మలుపు అవుతుందని నిపుణుల అంచనా.