ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

భారత నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో శుక్రవారం ఉదయం ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్​లో జరిగిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షాతోపాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. మాజీ ఉప రాష్ట్రపతులు జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా, నితిన్‌ గడ్కరీ, పియూష్‌ గోయెల్‌, ధర్మేంద్ర ప్రదాన్‌ సహా పలువురు కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, ఎన్డీయే కూటమికి చెందిన నేతలు, ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

జగదీప్ ధన్​ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక అనివార్యమైంది. సీపీ రాధాకృష్ణన్​ను ఎన్డీఏ కూటమి రంగంలోకి దింపగా, ప్రతిపక్ష ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి పోటీ చేశారు. ఈనెల 9న జరిగిన పోలింగ్‌లో సీపీ రాధాకృష్ణన్‌ తన ప్రత్యర్థిపై 152 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ముందుకు నుంచి ఉన్న అంచనాల తగ్గట్లు ఉపరాష్ట్రపతి అయ్యారు.

ఇప్పుడు ఎన్నిక లాంఛనాలన్నీ పూర్తి కావడంతో గురువారం మహారాష్ట్ర గవర్నర్‌ పదవికి సీపీ రాధాకృష్ణన్‌ రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్ర బాధ్యతలను గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌కు రాష్ట్రపతి ముర్ము అప్పగించారు. ఇప్పుడు రాధాకృష్ణన్​తో ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేయించారు. అయితే రాజీనామా చేసిన తర్వాత ధన్​ఖఢ్ బహిరంగ కార్యక్రమంలో కనపడడం నేడే తొలిసారి.