నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్‌ జెన్‌ జెడ్‌లో చీలిక!

నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్‌ జెన్‌ జెడ్‌లో చీలిక!

నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వ సారథి ఎంపికపై జెన్‌ జెడ్‌ నిరసనకారుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ పేరును బుధవారం జరిగిన ఆన్‌లైన్‌ అభిప్రాయ సేకరణలో మెజారిటీ సభ్యులు ప్రతిపాదించినట్లు వార్తలు రాగా ఆమె అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం కుదరలేదని మరో గ్రూపు నిరసనకారులు గురువారం వెల్లడించారు. 

నేపాల్‌ విద్యుత్‌ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్‌ చీఫ్‌ కుల్మన్‌ ఘీషింగ్‌ పేరును తాత్కాలిక ప్రభుత్వ సారథిగా వారు ప్రతిపాదించారు.  దానితో అరాచక పరిస్థితులను, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపాల్‌కు తాత్కాలికంగా నాయకత్వ బాధ్యతలు చేపట్టే విషయమై అనిశ్చితి కొనసాగుతోంది.  సుప్రీం కోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ సుశీల్‌ కర్కి వయసు, అర్హతల సాకుతో ఆందోళనకారులలో ఓ వర్గం ఆమె పేరును పక్కకు పెట్టి కుల్మాన్‌ ఘీజింగ్‌ పేరును ప్రతిపాదిస్తున్నారు.

గురువారం మధ్యాహ్నం, ఆర్మీ కాంప్లెక్స్ వెలుపల ప్రత్యర్థి గ్రూపులు ఘర్షణ పడ్డాయి, తాత్కాలిక ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలనే దానిపై తీవ్రంగా వాదించుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఏకాభిప్రాయ అభ్యర్థితో తిరిగి రావాలని ఆర్మీ అధికారులు నిరసనకారులను కోరారు.  ఆందోళనకారుల్లోనే మరో వర్గం ఇంకా కర్కిని బలపరుస్తోంది. మరోవైపు కర్కి కూడా చర్చల్లో పాల్గొంటున్నారు.  నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ఆమె సంసిద్ధంగా కూడా వున్నారని వార్తలు వెలువడుతున్నాయి.

డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ డిస్కార్డ్‌ ద్వారా ఆన్‌లైన్‌ ఓటింగ్‌ నిర్వహించగా, మెజారిటీ ప్రజలు సుశీలా కర్కి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.  తక్షణమే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పార్లమెంట్‌ను రద్దుచేయాలని ఖాట్మండు మేయర్‌ బాలేంద్ర షా అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారు. తాను రేస్‌లో లేనని ఖాట్మండు మేయర్‌ బాలేంద్ర షా స్పష్టం చేయడంతో తెరపైకి వచ్చిన మరో పేరు కుల్మాన్‌ ఘీజింగ్‌.

నేపాల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన ఘీజింగ్‌ ఈ ఏడాది మార్చిలో వివాదాస్పద రీతిలో పదవీచ్యుతుడయ్యారు. ఏళ్ల తరబడి నేపాల్‌లో కొనసాగిన విద్యుత్‌ సంక్షోభాన్ని పరిష్కరించినట్లు చెబుతున్నారు. ఆందోళనల నేపథ్యంలో ప్రధాని ఓలి రాజీనామాతో దేశంలో నెలకొన్న పరిస్థితులను చక్కబరచాలంటే చర్చలే శరణ్యమని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు చర్చల కోసం వారు పిలుపునిచ్చారు.

ఈ మేరకు నేపాలీ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (యునిఫైడ్‌ మార్క్సిస్ట్‌ – లెనినిస్ట్‌), సిపిఎన్‌ (మావోయిస్టు సెంటర్‌) నేతలు వేర్వేరుగా ప్రకటనలు చేశారు.  రాజ్యాంగ చట్రపరిధిలో శాంతియుతంగా సంక్షోభాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం వుందని వారు నొక్కి చెప్పారు. యువత చేసిన డిమాండ్లను రాజ్యాంగ మార్గాల ద్వారా పరిష్కరించాలని కోరారు. ఈ పరిస్థితుల్లో జెన్‌ జడ్‌ కార్యకర్తలు ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ వద్దకు చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అశోక్‌ సిగ్దల్‌కు అధికారమిచ్చారు.

కాగా, నేపాల్‌ ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య 34కి చేరింది. భద్రతా సిబ్బందితో జైల్లో ఖైదీలు ఘర్షణలకు దిగగా ముగ్గురు మరణించారు. దీంతో మరణించిన ఖైదీల సంఖ్య ఎనిమిదికి చేరింది. దేశవ్యాప్తంగా 1368 మంది చికిత్స పొందుతున్నారని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మరణించిన వారిలో 25మందిని గుర్తించినట్లు ఖాట్మండు పోస్ట్‌ పేర్కొంది. అంతర్జాతీయ ప్రోటోకాల్‌ మేరకు పోస్టుమార్టం నిర్వహించామని, వివరాలు వెల్లడించలేమని, మృతదేహాలను పరిరక్షించాల్సిందిగా కోరారని త్రిభువన్‌ యూనివర్శిటీ ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగ అధికారులు తెలిపారు.

నిరసనలు, అల్లర్లు చెలరేగిన ఆ రెండు రోజుల సమయంలో దేశవ్యాప్తంగా రెండు డజన్లకు పైగా జైళ్ల నుండి 15వేల మందికి పైగా ఖైదీలు పారిపోయారు.  ఖాట్మండు లోయలోని మూడు జిల్లాల్లో నిషేధాజ్ఞలను సైన్యం పొడిగించింది. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనడంపై ఆర్మీ దృష్టి పెట్టి అందుకు తగిన చర్యలు తీసుకుంటుండగా తాత్కాలిక ప్రభుత్వ నేతలపై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని నేపాల్‌ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడల్‌ విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ పరిధిలోనే వుంటూ సాధ్యమైనంత త్వరగా నిరసనకారుల డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి జరుగుతోందని చెప్పారు. జాతినుద్దేశించి ప్రసంగించాలంటూ అభ్యర్థనలు వస్తున్న తరుణంలో పౌడల్‌ గురువారం ఒక ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు.

హింసతో బాధపడుతున్న నేపాల్‌లో కర్ఫ్యూపై పాక్షిక సడలింపు ఆదేశాలతో, ఖాట్మండులోని సుప్రీంకోర్టు మరియు బ్యాంకులు గురువారం తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉన్నాయి, వాణిజ్య కార్యకలాపాలు నెమ్మదిగా వేగం పుంజుకుంటున్నాయి. కొనసాగుతున్న నిరసనల సమయంలో విస్తృతంగా నష్టపోయిన నేపాల్ అత్యున్నత న్యాయస్థానం ఆదివారం తెరవనున్నారు.

గురువారం జరిగిన అత్యవసర ఫుల్ బెంచ్ సమావేశంలో తిరిగి తెరవాలని నిర్ణయం తీసుకున్నారు. అశాంతి సమయంలో అనేక ముఖ్యమైన కోర్టు పత్రాలు తిరిగి పొందలేనంతగా ధ్వంసమయ్యాయని ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ మాన్ సింగ్ రౌత్ పేర్కొన్నారు.