ఎన్నికల సంఘానికి, పార్టీలకు మధ్య విభేదాలపై సుప్రీం విచారం

ఎన్నికల సంఘానికి, పార్టీలకు మధ్య విభేదాలపై సుప్రీం విచారం
కేంద్ర ఎన్నికల సంఘానికి, వివిధ రాజకీయ పార్టీలకు మధ్య విభేదాలు దురదృష్టకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్ఐఆర్) పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) తర్వాత ఈసీ ప్రకటించిన ముసాయిదా ఓటర్‌ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించేందుకు విధించిన సెప్టెంబర్ 1 డైడ్‌లైన్‌ను పొడిగించాలని దాఖలైన పిటిషన్లపై  సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
 
 ఈ పిటిషన్‌లపై సోమవారం జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోరుమల్య బ్గాగ్జిలతో కూడిన ధర్మాసనం విచారించింది.  దీన్ని విశ్వాస సమస్యగానే పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇచ్చిన ఈ గడువును పొడిగించాలని ఆర్‌జెడితోపాటు పలు రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశాయి.  జాబితాపై ఫిర్యాదుల విషయంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేయాలని బీహార్‌ లీగల్‌ సర్వే అథారిటీకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 
ప్రధానంగా మంగళవారం మధ్యాహ్నం నాటికి ఓటర్లు, రాజకీయ పార్టీలు తమ క్లెయిమ్‌లు, అభ్యంతరాలు సరిద్దడానికి పారా లీగల్‌ వాలంటర్లకు పేర్లు, మొబైల్‌ నంబర్‌లతోపాటు తెలియజేయాలని అన్ని జిల్లాల లీగల్‌ సర్వీసెస్‌ అధికారులకు ఆ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఛైర్మన్‌ ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టు కోరింది.

కాగా, సెప్టెంబర్ 1 తర్వాత కూడా అభ్యంతరాలను స్వీకరిస్తామని, నామినేషన్ల దాఖలు చివరి తేదీవరకు సవరణలు కొనసాగుతాయని సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం తెలిపింది.  బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఆ రాష్ట్రంలో ఓటరు జాబితాను సవరించి ఆగస్టు 1న ముసాయిదా జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను ప్రధాన రాజకీయ పార్టీలకు అందజేయడంతోపాటు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. 

ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్‌ 1 లోగా తెలియజేయాలని కోరింది. దాంతో అభ్యంతరాలను తెలియజేయాల్సిన గడువును పొడిగించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్‌లపైననే తాజాగా విచారణ జరిగింది. ముసాయిదా జాబితా నుంచి 65 లక్షల మంది ఓటర్ల వివరాలను ఈసీ తొలగించింది. మరోవైపు పౌరసత్వంపై అనుమానాలున్న మూడు లక్షల మందికి నోటీసులు పంపించినట్లు ఈసీ తెలిపింది.