దేశ విభజనకు ఆ ముగ్గురే కారణం

దేశ విభజనకు ఆ ముగ్గురే కారణం
భారతదేశ విభజనను గుర్తుచేస్తూ ప్రత్యేక మాడ్యూల్‌ను విడుదల చేసిన  నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సిఇఆర్‌టి), విభజనకు మహ్మద్ అలీ జిన్నా, అప్పటి వైస్రాయ్ మౌంట్‌బాటన్‌తో పాటు కాంగ్రెస్‌పార్టీని బాధ్యులుగా పేర్కొంది. 1940 లాహోర్‌ ముస్లిం లీగ్ సమావేశంలో హిందూ, ముస్లింలు భిన్న మత, సామాజిక ఆచారాలు కల్గి ఉన్నారంటూ జిన్నా రెచ్చగొట్టినట్లు మాడ్యూల్‌లో వివరించింది.

 విభజనకు జిన్నా డిమాండ్ చేయగా, కాంగ్రెస్‌ పార్టీ దాన్ని ఆమోదించిందని, బాటన్ అమలు చేశారని తెలిపింది. తన డిమాండ్‌ నిజమవుతుందని పాకిస్థాన్‌ను చూస్తానని అనుకోలేదని స్వయంగా జిన్నానే చెప్పారని తెలిపింది. విభజనను అనివార్యమైన చేదు ఔషధంగా సర్దార్ పటేల్, తప్పు కానీ తప్పనిసరి అని నెహ్రూ అభివర్ణించారని పేర్కొంది.  విభజన తర్వాత కశ్మీర్ కొత్త సమస్యగా ఉద్భవించి, భారత విదేశాంగ విధానానికి ఆటంకం కలిగిస్తోందని వివరించింది.

భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు కొన్నిదేశాలు కశ్మీర్ అంశంలో పాక్‌కు మద్దతిస్తుంటాయని తెలిపింది.  ఈ క్రమంలోనే 1947లో జరిగిన భారత్‌ పాకిస్థాన్‌ విభజన సమయంలో ప్రజల బాధ, బాధితుల వేదనలను గుర్తు చేసుకుంటూ ఏటా ఆగస్టు 14న కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ‘విభజన గాయాల స్మారక దినం’ గురించి ఇందులో ప్రస్తావించారు. 6 నుంచి 8 తరగతి విద్యార్థులకు ఒకటి, 9 నుంచి 12 తరగుతుల విధ్యార్థులకు మరొక మాడ్యుల్​ను రూపొందించింది. 

ఇవి రెండూ ఇంగ్లీష్​, హిందీ భాషల్లో ఉంటాయని చెప్పింది. కానీ రెగ్యూలర్​ పుస్తకాల్లో కాకుండా సప్లిమెంటరీగా ఉంటాయని తెలిపింది. ముఖ్యంగా ప్రాజెక్టులు, పోస్టర్లు, చర్చలు, వాదనల కోసం వినియోగించుకోవాలని సూచించింది. ఈ రెండు మాడ్యుళ్లకు కూడా మొదట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశం ఉంటుంది.