గెలిస్తే ప్రజాతీర్పు, ఓడితే ఈవీఎంల తప్పా?

గెలిస్తే ప్రజాతీర్పు, ఓడితే ఈవీఎంల తప్పా?
వైసీపీ వాళ్లు గెలిస్తే ప్రజాతీర్పు అంటారని, కూటమి గెలిస్తే ఈవీఎంల తప్పు అంటున్నారని అంటూ పులివెందుల జెడ్పిటిసి ఉపఎన్నికల ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలను ప్రస్తావిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో జాతీయ జెండా ఎగురవేసి, గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రసంగించారు.
 
జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కొన్ని పార్టీల నాయకులు ఓడిపోయినప్పుడే ఈవీఎంలలో తప్పులు, ఓటు చోరీ జరిగాయని ఆరోపించడం సరికాదని పవన్ కళ్యాణ్ హితవు చెప్పారు. వారు గెలిచినప్పుడు ఈ ఆరోపణలు ఎందుకు చేయరని ప్రశ్నించారు. ఇది కేవలం ఎన్నికల ఓటమిని అంగీకరించలేకపోవడమేనని ఆయన ధ్వజమెత్తారు. 2019 ఎన్నికలలో వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో గెలిచినప్పుడు తమ పార్టీలు ఎక్కడా కూడా ‘ఓట్ చోరీ’ ఆరోపణలు చేయలేదని గుర్తు చేశారు. 
 
ప్రజల తీర్పును గౌరవించి, ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధపడ్డామని చెప్పారు. కానీ ఇప్పుడు, కూటమి 164 సీట్లతో గెలిచినప్పుడు, ఈవీఎంలలో తప్పులు జరిగాయని ఆరోపణలు చేయడం అన్యాయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా లేనప్పుడు మాత్రమే ప్రశ్నించడం సరైన విధానం కాదని ఆయన స్పష్టం చేశారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పే అంతిమమని పవన్ కళ్యాణ్ బలంగా నొక్కి చెప్పారు. ఓటమిని స్వీకరించే మనస్తత్వం నాయకులకు ఉండాలని సూచించారు. ఈ విధంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం సన్నగిల్లుతుందని హెచ్చరించారు. ఎన్నికల సంఘం పారదర్శకతతో పనిచేస్తుందని, ప్రజలు ఇచ్చే తీర్పును గౌరవించడం ద్వారానే ప్రజాస్వామ్యం మరింత పటిష్టమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ ఆరోపణలు కేవలం ఓటమిని అంగీకరించలేని నాయకుల నిస్సహాయతను చూపిస్తున్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు రావాలన్నా శాంతి భద్రతలు బలంగా ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసిపి పాలనలో ఎవరైనా గొంతెత్తితే దాడులు జరిగేవనీ పేర్కొంటూ అవినీతికి అలవాటుపడిన వాళ్లు ఏమైనా చేస్తారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.