ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి జవాన్ వీరమరణం

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి జవాన్ వీరమరణం

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. భారత్‌తో తరచూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి ప్రాంతంలో నియంత్రణ రేఖకు సమీపంలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగినట్లు భారత సైన్యం ప్రకటించింది. 

పాకిస్తాన్ బలగాలు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించాయని, దీంతో వారిని తీవ్రంగా ప్రతిఘటించినట్లు తెలిపింది. దీంతో రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు చోటు చేసుకోగా, ఈ ఎదురుకాల్పుల్లో ఒక భారత సైనికుడు ప్రాణాలు కోల్పోయినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే సాధారణంగా జరిగే చొరబాట్ల లాగా కాకుండా ఈసారి కొత్తగా ప్రయత్నాలు చేసినట్లు పేర్కొన్నాయి.  

భారత్‌లోకి చొరబడేందుకు  వారికి పాకిస్తాన్ సైన్యం మద్దతు తెలిపిందని భారత సైనిక అధికారులు తెలిపారు. అంతేకాకుండా పాక్ సైన్యం నుంచి చొరబాటుదారులకు కాల్పుల మద్దతు కూడా లభించిందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ సరిహద్దు యాక్షన్ టీమ్స్ అండతోనే ఈ చొరబాటు ప్రయత్నం జరిగిందని భారత సైనిక వర్గాలు స్పష్టం చేశాయి.

ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతం అయిన పహల్గామ్‌లో పాక్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. పహాల్గమ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.

ఈ ఘటనలో మొత్తం 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్లు భారత్ ప్రకటించింది. అదే సమయంలో పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్ మధ్య అడపాదడపా దాడులు జరుగుతున్నప్పటికీ.. సరిహద్దుల్లో ఈ స్థాయిలో చొరబాటు, కాల్పులు, భారత జవాన్ ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.