
మయన్మార్ నిర్బంధ కేంద్రాల్లో హింస, లైంగిక నేరాలు జరుగుతున్నాయని ఐరాస మద్దతు గల దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. గతేడాది కాలంగా బాధితులను విద్యుత్ షాక్లు, గొంతు కోసి చంపడం, సామూహిక అత్యాచారం, అంతర్గత అవయవాలను తగులబెట్టడం వంటి ‘వ్యవస్థాగత హింస’కి సంబంధించిన ముఖ్యమైన ఆధారాలను గుర్తించినట్లు తెలిపాయి.
నికోలస్ కౌమ్జియాన్ నేతృత్వంలోని అంతర్జాతీయ స్వతంత్ర దర్యాప్తు సంస్థ తన వార్షిక నివేదికను విడుదల చేసింది. మయన్మార్లో హక్కుల ఉల్లంఘనల ఘటనలను నమోదు చేసేందుకు యుఎన్ మద్దతు గల మానవ హక్కుల మండలి ఆదేశం ప్రకారం 2018 నుండి మయన్మార్పై ఈ సంస్థ దర్యాప్తు చేపడుతోంది. 2021 ఫిబ్రవరిలో ఎన్నికైన అంగసాన్ సూకీ ప్రభుత్వం నుండి అధకారాన్ని సైన్యం స్వాధీనం చేసుకున్న అనంతరం అంతర్యుద్ధంతో మయన్మార్ అల్లకల్లోలంగా మారిన సంగతి తెలిసిందే.
శాంతియుత నిరసనలను అణచివేయడంతో ప్రజలు ఆయుధాలు చేపట్టడంతో పలు ప్రాంతాలు సంఘర్షణలో చిక్కుకున్నాయి. నిర్బంధ కేంద్రాల్లో భద్రతా సిబ్బందిని, ఇన్ఫార్మర్ల పేరుతో పట్టుబడిన వారిని, పౌరులను ఉరితీస్తున్నారని, ఆ నేరస్తులను గుర్తించడంలో పురోగతి సాధించామని దర్యాప్తు బృందం తెలిపింది. వారిలో భద్రతా దళాలు, అనుబంధ మిలీషియాలు, ప్రతిపక్ష సాయుధ గ్రూపులు ఉన్నాయని తెలిపింది.
నిర్బంధ కేంద్రాల్లోని వారిని కొట్టడం, విద్యుత్ షాక్లు, గొంతు కోసి చంపడం, సామూహిక అత్యాచారం, అంతర్గత అవయవాలను తగులబెట్టడం మరియు ఇతర రకాల లైంగిక హింస ఘటనలు ఉన్నట్లు నివేదిక సారాంశం పేర్కొంది. మయన్మార్లో జరిగిన దురాగతాలను మరియు క్రూరత్వంలో నిరంతర పెరుగుదలను ఈ నివేదిక హైలెట్ చేస్తుందని కౌమ్జియాన్ పేర్కొన్నారు. నిందితులను కోర్టు ఎదుట ప్రవేశపెట్టే రోజుకోసం కృషి చేస్తున్నామని తెలిపారు.
మయన్మార్ నిర్బంధ కేంద్రాల్లో క్రమబద్ధంగా సాగుతున్న హింసకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, సాక్ష్యాలతో సహా అన్ని ముఖ్యమైన ఆధారాలను గుర్తించామని వెల్లడించారు. ప్రస్తుతం రఖైన్ రాష్ట్రంలో కొన్ని వర్గాలపైప జరిగిన దారుణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు సైన్యం, అరకాన్ అర్మీ (ప్రతిపక్ష దళం) పోరాడుతున్నాయని తెలిపారు.
2017లో మయన్మార్లో హింసాత్మక ఘటనల నుండి రక్షణ కోసం 70,000మందికి పైగా రోహింగ్యాలు బంగ్లాదేశ్కు పారిపోయారు. గతేడాది అరకాన్ ఆర్మీ రఖైన్ను స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు, యుఎన్ అంతర్జాతీయ న్యాయస్థానంలో రోహింగ్యాలకు సంబంధించిన కేసులను పరిశీలిస్తున్న అధికారులకు ఆధారాలను అందించింది.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక