జస్టిస్‌ వర్మపై అభిశంసన తీర్మానాన్ని స్వీకరించిన స్పీకర్‌

జస్టిస్‌ వర్మపై అభిశంసన తీర్మానాన్ని స్వీకరించిన స్పీకర్‌
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారం దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆయన అభిశంసన తీర్మానాన్ని తాజాగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్వీకరించారు. అభిశంసనపై 146 మంది ఎంపీలు సంతకాలు చేసిన తీర్మానాన్ని ఆమోదించారు. ఈ మేరకు జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. 

ఈ ప్యానెల్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మణీందర్‌ మోహన్‌, సీనియర్‌ న్యాయవాది బీవీ ఆచార్య ఉన్నారు. విచారణ నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని కమిటీని స్పీకర్‌ ఈ సందర్భంగా కోరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది.

అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు వచ్చిన సమయంలో పెద్ద మొత్తంలో కాలిపోయిన నోట్ల కట్టలు, సగం కాలిన నోట్లు కనిపించాయి.  ఈ ఘటన తర్వాత జస్టిస్‌ వర్మను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అంతర్గత దర్యాప్తు కోసం ఆదేశించింది. అయితే, విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్‌ వర్మ నివాసంలో నోట్ల కట్టలు దొరికింది వాస్తవమేనని త్రిసభ్య కమిటీ తేల్చింది. 

ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది. అయితే, కమిటీ దర్యాప్తు నివేదికను ఆయన సవాల్‌ చేశారు. పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు జస్టిస్‌ వర్మ ప్రవర్తన విశ్వాసాన్ని కలిగించదని, ఆయన పిటిషన్‌ను విచారణకు పరిగణలోకి తీసుకోకూడదని ధర్మాసనం పేర్కొంది.