వీడియోలో ఉగ్ర శిబిరాలపై భారత్ వైమానిక దాడి 

వీడియోలో ఉగ్ర శిబిరాలపై భారత్ వైమానిక దాడి 

పహల్గామ్ లో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన ఉగ్ర దాడిలో పలువురు అమాయకులు మరణించిన దానికి ప్రతికారంగా భారత సైన్యం మే నెలలో ఆపరేషన్ సిందూర్ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లలోని పలు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బకు పాకిస్తాన్‌ కాళ్ల బేరానికి రాకతప్పలేదు. కొన్ని గంటల్లోనే తీవ్ర నష్టానికి గురైన పాకిస్థాన్‌ భారతే యుద్ధం వద్దని దిగువచ్చింది. 

అయినా, విజయం మనదే అంటూ తమ దేశ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింద. అంతేకాదు పాక్‌ ఆర్మీ అధికారులతో కలసి విందు సైతం చేసుకుంది. అయితే, తాజాగా ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా జరిగిన దాడికి సంబంధించిన వీడియోను భారత వైమానిక దళం (ఐఏఎఫ్) విడుదల చేసింది.  ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించిన ఎక్స్ లో పోస్ట్ చేసిన 5 నిమిషాల వీడియోలో మొదట ఏప్రిల్ 22 న జరిగిన పహల్గామ్ ఉగ్రదారికి సంబంధించిన వార్తాపత్రికల క్లిప్పింగ్‌లను ప్రదర్శించింది.  

పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిసిఎస్) జనరల్ అనిల్ చౌహాన్ తదితరులు త్రివిధ దళాల అధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు వీడియోలో చూపించారు.  ఇక, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ అనే టెక్స్ట్ తో నల్లని బ్యాక్ గ్రౌండ్ కనిపించింది.

తర్వాత ”భారత వైమానిక దళం ఖచ్చితత్వంతో, వేగంతో, సంకల్పంతో స్పందించింది” అని రాసింది. ఇక, ఆ తర్వాత పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత యుద్ధ విమానాలు జరిపిన వైమానిక దాడులను చూపించింది.  భారత వైమానిక దళ ధ్వంసం చేసిన ఉగ్రవాద శిబిరాలకు సంబంధించిన క్లిప్‌లు,చిత్రాలను కూడా ఇందులో పొందుపరిచింది. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత యుద్ధ విమానాలు ఎలా పనిచేశాయో కూడా ఈ వీడియోలో చూపించడం గమనార్హం.

2019లో పుల్వామా దాడికి ప్రతిస్పందనగా కార్గిల్ యుద్ధం, భారతదేశం జరిపిన దాడులను కూడా ఇందులో ప్రస్తావించారు.  “ఆకాశం చీకటిగా మారి, భూమి లేదా సముద్రంలో ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, ఒక శక్తి పైకి లేస్తుంది. విశాలమైనది, నిర్భయమైనది, ఖచ్చితమైనది అదే భారత వైమానిక దళం,” అని వాయిస్ ఓవర్‌లో వివరించింది. 

పహల్గామ్ దాడితో సరిహద్దు ప్రాంతాలను కనుగొన్న తర్వాత భారత సాయుధ దళాలు మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాయి . వారు పలు ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాయి. ఆ తరువాత పాకిస్తాన్ భారీ క్షిపణి, డ్రోన్ దాడిని ప్రారంభించింది, అప్రమత్తమైన భారత్‌ దాన్ని విజయవంతంగా తిప్పికొట్టింది. ప్రతీకారంగా, భారత దళాలు పాకిస్తాన్‌లోని వైమానిక స్థావరాలపై దాడి చేశాయి.

దీంతో, వణికిపోయిన పాక్  కాళ్ల బేరానికి రావడం మే 10న జరిగిన కాల్పుల విరమణతో యుద్ధం ముగిసిన విషయం విదితమే. కాగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో ఐదు పాకిస్తాన్ యుద్ధ విమానాలను,  ఒక పెద్ద విమానాన్ని ఐఏఎఫ్ కూల్చివేసిందని ఈ మధ్యే ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే.