”దాదాగిరీ’ చేసినోళ్లు బెదిరిస్తున్నారు

”దాదాగిరీ’ చేసినోళ్లు బెదిరిస్తున్నారు
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బాదుడుతోపాటు బెదిరింపులకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘దాదాగిరీ’ చేసినోళ్లు ఆర్థికంగా బలంగా ఉండి బెదిరిస్తున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మండిపడ్డారు. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రసంగిస్తూ ఆర్థిక స్వావలంబన సాధించడానికి భారత్ ఎగుమతులను పెంచడంతోపాటు సాంకేతికతలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు.

“మన ఎగుమతి, ఆర్థిక వృద్ధి రేటు పెరిగితే ఎవరి దగ్గరకూ వెళ్లాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ‘దాదాగిరీ’ చేస్తున్న వారు ఆర్థికంగా బలంగా ఉన్నారు. సాంకేతికత కలిగి ఉన్నారు కాబట్టి అలా చేస్తున్నారు. ఆర్థికంగా బలంగా మారినప్పటికీ, సంస్కృతి ద్వారా భారత్​ మార్గనిర్దేశం ఉంటుంది” అని నితిన్ గడ్కరీ తెలిపారు. 

“నేడు మనం ఆర్థికంగా బలపడి, టెక్నాలజీలో కూడా ముందున్నా కూడా మనం ఎవరినీ బెదిరించం. ఎందుకంటే ఇది మన సంస్కృతిలో లేదు. ప్రపంచ సంక్షేమం అత్యంత ముఖ్యమైనదని మన సంస్కృతి మనకు బోధిస్తుంది” అని చెప్పారు. నేడు ప్రపంచంలోని అన్ని సమస్యలకు పరిష్కారం సైన్స్, టెక్నాలజీ, జ్ఞానం అని స్పష్టం చేశారు. మనం ఈ మూడు విషయాలను ఉపయోగిస్తే, మనం ఎప్పటికీ ప్రపంచానికి తలవంచాల్సిన అవసరం ఉండదని చెప్పారు. 

పరిశోధనా కేంద్రాలు, ఐఐటీలు ఇంజనీరింగ్ కళాశాలలు దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పరిశోధనలు నిర్వహించాలని గడ్కరీ సూచించారు. అన్ని జిల్లాలు, రాష్ట్రాలు, ప్రాంతాలలో విభిన్న విషయాలు ఉన్నాయని చెబుతూ మనం ప్రతి ఒక్కరినీ దృష్టిలో ఉంచుకుని పని చేయాలని చెప్పారు. మనం అలాంటి పని నిరంతరం చేస్తే, మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం భారత్​ దిగుమతులపై అదనంగా 25 శాతం సుంకాన్ని విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన తర్వాత నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ భద్రత, విదేశాంగ విధానపరమైన ఆందోళనలు, ఇతర సంబంధిత వాణిజ్య చట్టాలను కూడా ట్రంప్ సుంకాల పెరుగుదలకు కారణమని పేర్కొన్నారు.